అందరికి ఆరోగ్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.. మంత్రి రాజనర్సింహ

పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించి, అందరికీ ఆరోగ్యం అందించడమే ప్రధాన ధ్యేయం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Update: 2024-07-07 11:56 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించి, అందరికీ ఆరోగ్యం అందించడమే ప్రధాన ధ్యేయం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 1003 పడకల జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. మెడికల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ ఇంజనీరింగ్ అధికారి నిర్మాణ వివరాలు మ్యాప్ ద్వారా వివరించారు. నిర్మాణ వివరాలు తెలుసుకుని మంత్రి పలు సూచనలు చేశారు. సంవత్సరం చివరిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, కొత్తగా నిర్మాణం చేస్తున్న జనరల్ ఆసుపత్రి 1003 బెడ్ లు, ఎంసీహెచ్ లో 220 బెడ్ లు కలిపి 1225 బెడ్ లకు గాను అధనంగా డాక్టర్లు, సిబ్బంది, టెక్నీషియన్ లు, ఫార్మసిస్ట్ లు ఇతర సిబ్బంది అదనంగా 600 పై చిలుకు అవసరం వుంటుందని, ప్రభుత్వం అదనపు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.

జిల్లాలోని గద్వాల, నారాయణ పేట, నాగర్ కర్నూల్ లో మెడికల్ కాలేజీల్లో అన్ని వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు, పీహెచ్ సీ, సబ్ సెంటర్, ఏరియా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. సామాన్యులు సర్కార్ దవాఖాన నాది అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కృషి చేస్తోందని, అన్ని ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, మందులు, అదనపు సిబ్బంది ఇతరత్రా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 9 న ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పై ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో చర్చించి సాగు నీటి ప్రాజెక్ట్ లు, విద్య, వైద్యరంగం, పర్యాటక రంగ అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, తదితర అంశాల పై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల పై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కృష్ణ, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జీవన్ తదితరులు ఉన్నారు.


Similar News