ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకండి : శ్రీనివాస్ గౌడ్

గతంలో ప్రజా వేదిక అయిన అసెంబ్లీ సాక్షిగా 'తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమని, ఏం చేసుకుంటారో చేసుకొండి' అని మోహం మీద చెప్పిన కాంగ్రెస్ పార్టీ కి ఏం మోహం పెట్టుకొని ఓటేస్తారని, ఆ పార్టీకీ ఒక్క ఓటు కూడా వేయకూడదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Update: 2023-11-20 16:38 GMT

దిశ,మహబూబ్ నగర్: గతంలో ప్రజా వేదిక అయిన అసెంబ్లీ సాక్షిగా 'తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమని, ఏం చేసుకుంటారో చేసుకొండి' అని మోహం మీద చెప్పిన కాంగ్రెస్ పార్టీ కి ఏం మోహం పెట్టుకొని ఓటేస్తారని, ఆ పార్టీకీ ఒక్క ఓటు కూడా వేయకూడదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని మోటారు లైన్, టీచర్స్ కాలనీ, మర్లు ప్రాంతాలలో నిర్వహించిన రోడ్ షో లో ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో నీళ్ళు, కరెంటు లేక పరిశ్రమలు, వ్యాపారాలు మూత పడ్డాయని,15 రోజులకొకసారి మంచినీరు, 6 గంటల కరెంటు,అది ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొని అయోమయంలో కాలం గడిపామని ఆయన విమర్శించారు.

2014 కంటే ముందు మోటార్ లైన్, టీచర్స్ కాలనీ, మర్లు ప్రాంతాలలో వర్షం చినుకు పడితే బురద,నీరు పొంగి కాలు పెట్టలేని పరిస్థితుల నుంచి, నేడు అద్దంలాంటి రోడ్లు వేసుకొని, 24 గంటల కరెంటుతో, రోజు తప్పి రోజు మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీటితో సంతోషంగా బతుకుతున్నామని ఆయన అన్నారు. కులం, మతం పేరుతో రెచ్చగొట్టే కాంగ్రెస్, బీజెపీ ల నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,అభివృద్ధికి చిరునామాగా ఉన్న బీఆర్ఎస్ కారు గుర్తుకే తమ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్,కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్,అహ్మద్ అలి సనా,రవీందర్ రెడ్డి,రాములు తదితరులు పాల్గొన్నారు.


Similar News