పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య

పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2024-09-21 06:06 GMT

దిశ భిక్కనూరు: పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని బీబీపేట మండలం కోనాపూర్, దోమకొండ మండలం అంబర్‌పేట గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... బీబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మొగిలి సాయికుమార్ (24) మెదక్ జిల్లా తూప్రాన్ లో పీఈటీగా పని చేస్తున్నాడు. దోమకొండ మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన రంగోలి వీణ (23) డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసి ఇంట్లో ఉంటుంది. అయితే వీరిద్దరూ ఒకే కాలేజీలో క్లాస్మేట్స్ కావడంతో అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు యత్నించగా, యువతి తరుపు కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు.

అయినప్పటికీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టారు. వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన సాయికుమార్ కోనాపూర్ గ్రామంలోని తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, అంబర్‌పేట గ్రామానికి చెందిన యువతి వీణ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, దోమకొండ ఎస్ఐ ఆంజనేయులు ఇరు కుటుంబాలను విచారిస్తున్నారు. అలాగే మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News