ఎడ్యుకేషన్ పాలసీయే లేదు.. రేవంత్ సర్కారుపై కొప్పుల ఫైర్

రాష్ట్రం‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విచిత్రంగా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Update: 2024-06-19 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రం‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విచిత్రంగా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ విధానాలు కేసీఆర్ స్కీంలను ఎత్తివేయడమే పనిగా పెట్టుకున్నట్లు అర్థం అవుతోందన్నారు. కేసీఆర్ మార్క్ లేకుండా చేయాలని కుట్ర పన్నారని మండిపడ్డారు. టీఎస్ స్థానంలో టీజీ తెచ్చారని.. రాష్ట్ర చిహ్నం మార్చాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారుడు కాదని ఆయనకు తెలంగాణ చరిత్ర తెలియదన్నారు. అత్యవసర విషయాలు పక్కన బెట్టి వేరే అంశాలపై రేవంత్ దృష్టి పెడుతున్నాని ఫైర్ అయ్యారు. కేసీఆర్ రాష్ట్రంలో గురుకుల విద్యను పటిష్టం చేశారని రేవంత్ గురుకుల విద్యను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మొత్తం 917 గురుకులాలు స్థాపించారని.. ఒక్కో విద్యార్థిపై లక్షా 20 వేలు ఖర్చు చేశారన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ జరిగిందన్నారు. జూనియర్, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు కేసీఆర్ సీఎం అయ్యాకే భారీగా పెరిగాయన్నారు.

గురుకుల పిల్లలకు రకరకాల పరీక్షలకు కోచింగ్ ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పోటీ పరీక్షల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు సత్తా చాటుతున్నారంటే అది కేసీఆర్ విధానాల ఫలితమే అన్నారు. గురుకులాలను పెంచాల్సింది పోయి రేవంత్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ , ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉపయోగపడే గురుకుల విద్యను నాశనం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మన ఊరు మన బడి కేసీఆర్ హయాంలో పెట్టిన గొప్ప కార్యక్రమం అన్నారు. అది కొనసాగిస్తారా మూసేస్తారా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ప్రభుత్వానికి విద్యపై ఓ పాలసీ అంటూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Similar News