ఈఓ వల్లనే అంకురార్పణ ఆలస్యం అయింది.. మరో వీడియో విడుదల చేసిన రామాలయం అర్చకులు

భద్రాద్రిలో జరిగే అతి ముఖ్యమైన ఉత్సవం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముందు పాల్గుణ పౌర్ణమి నాడు నిర్వహించే వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలకు అంకురార్పణ ఆలస్యం కావడానికి రామాలయం అర్చకులు కాదని

Update: 2025-03-16 12:52 GMT

దిశ, భద్రాచలం : భద్రాద్రిలో జరిగే అతి ముఖ్యమైన ఉత్సవం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముందు పాల్గుణ పౌర్ణమి నాడు నిర్వహించే వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలకు అంకురార్పణ ఆలస్యం కావడానికి రామాలయం అర్చకులు కాదని, ఈ ఓ నిర్ణయమే కారణం అని ఆలయ స్థానాచార్యులు స్థల సాయి, ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, రామ స్వరూప్, మురళీ లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ఆలయంలో జరిగే ఉత్సవాలు నిర్వహించడానికి ముందుగానే ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్ లను నిర్ణయుస్తామని, వీరు లక్ష్మి నరసింహాస్వామి బ్రహ్మోత్సవాల నుండి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల వరకూ వారే ముందుండి ప్రతి ఉత్సవం జరిపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆచార్య గా ప్రధాన అర్చకులు విజయ రాఘవన్ ,బ్రహ్మ గా ఉప ప్రధాన అర్చకులు అమరవాది వెంకట శ్రీనివాస రామానూజం వ్యవహారిస్తున్నారని తెలిపారు.

కాగా కొన్ని పరిపాలన పరమైన కారణాలతో బ్రహ్మ గా ఉన్న శ్రీనివాస రామానుజం ను ఈ ఓ పర్ణశాల ఆలయానికి మార్చి 9 న బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, దానికి శ్రీనివాస రామానుజం 10 వ తేదీన జాయినింగ్ లేఖతో పాటు తాను భద్రాద్రి రామాలయంలో జరిగే ఉత్సవాలకు బ్రహ్మ గా ఉన్నందున తనకు వసంతోత్సవం, డోలోత్సవం, శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో పాల్గొనే అనుమతి ఇవ్వాలని కోరారని, ఆ వినతిపత్రం పై ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు తమ అభిప్రాయం కూడా తెలుపుతూ సంతకం చేసారని, అయినా ఈ ఓ నుంచి ఎటువంటి అనుమతులు రాకపోవడంతో ఇద్దరు ప్రధాన అర్చకులు ఈ ఓ ని పలుసార్లు స్వయంగా కలిసి ఆలయంలో మతపరమైన సంప్రదాయాలు గురించి వివరిస్తూ... బ్రహ్మ లేకుండా ఉత్సవాలు నిర్వహించడం వీలుకాదని తెలిపినా ఈ ఓ స్పదించలేదని ఆరోపించారు.

చివరకు 13 వ తేదీ వసంతోత్సవానికి అంకురార్పణ రోజు సాయంత్రం అర్చకులు అందరు ఒక లేఖను ఈ ఓ కి అందజేసినా బ్రహ్మ పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేదని, బ్రహ్మ లేనిదే ఉత్సవం నిర్వహించలేమని, అది మతపరమైన సంప్రదాయానికి విరుద్ధం అని తెలపడంతో, చివరకు ఈ ఓ స్పందించి అనుమతి ఇచ్చారు. ఈ ఓ సరైన సమయంలో నిర్ణయం తీసుకోక పోవడం కారణంగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన అంకురార్పణ రాత్రి 9 గంటలకు ప్రారంభం అయిందని పేర్కొన్నారు. దీంట్లో అర్చకులు తప్పిదం లేదని తెలిపారు.

మత పరమైన సంప్రదాయాలు నిర్ణయించే హక్కు మాకు ఉంటుంది

ఆలయంలో జరిగే మత పరమైన, వైదికమైన అంశాలు నిర్ణయించే అధికారం ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులకు ఉంటుందని వీడియో లో పేర్కొన్నారు. పాలనా పరమైన అంశాలలో ఈ ఓ ని తప్పనిసరిగా గౌరవిస్తామని, అలాగే మత పరమైన, వైదికమైన విషయాలలో అర్చకులను ఈ ఓ గౌరవించాలని అన్నారు. ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస రామానుజం విషయంలో కూడా ఈ ఓ నిర్ణయానికి అడ్డు చెప్పలేదని, కానీ బ్రహ్మ లేకుండా ఉత్సవాలు నిర్వహించడం కుదరదు కనుక శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల వరకూ పాల్గొనే అనుమతి ఇవ్వాలని అడిగామని, బ్రహ్మోత్సవాలు అనంతరం పాలనా పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని తెలిపామని అన్నారు.


Similar News