మట్టి హాంఫట్.. కూసుమంచి మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా..
కూసుమంచి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది.
కూసుమంచి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు లేకుండానే పగలు రాత్రి అనే తేడా లేకుండా వెంచర్లు, పెట్రోల్ బంకులు, ఇండ్ల నిర్మాణాలకు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. మండలంలోని గురువాయిగూడెం గ్రామశివారు చెరువు సమీపంలో రైతుల ల్యాండ్ డెవలప్మెంట్ పేరిట సుమారు 20 అడుగుల లోతుతో జేసీబీల సాయంతో తవ్వుతూ.. ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి వెంబడి ఓ పెట్రోల్ బంకు లక్షల రూపాయలు విలువజేసే మట్టిని ఎటువంటి పర్మిషన్ లేకుండా ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఆదివారం, పండుగ దినాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజులను అదునుగా చేసుకుని రెచ్చిపోతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ, మైనింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో మండలంలో మట్టి మాఫియా లక్షల రూపాయలు విలువ చేసే మట్టి యథేచ్ఛగా తరలిస్తూ... ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
దిశ, కూసుమంచి రూరల్ : కూసుమంచి మండలంలో పలు గ్రామాల్లో మట్టి మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా రెచ్చిపోతోంది. రెవెన్యూ అధికారుల అండదండలతో ? మట్టి మాఫియా రెచ్చిపోయి అక్రమార్కులు తమ అక్రమ మట్టి దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంలో అటు మైనింగ్, ఇటు రెవెన్యూ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కూసుమంచి మండలంలోని గురువాయిగూడెం గ్రామ శివారు చెరువు సమీపంలో రైతుల ల్యాండ్ డెవలప్మెంట్ పేరిట సుమారు 20 అడుగుల లోతు మట్టిని జేసీబీల సహాయంతో తవ్వుతున్నారు. ట్రాక్టర్లతో కూసుమంచి గ్రామ శివారు ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి వెంబడి ఓ పెట్రోల్ బంకు నిర్మాణానికి లక్షలాది రూపాయలు విలువచేసే మట్టిని ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇది వారికి నిరంతరం దినచర్యగా మారిపోయింది. ఆదివారం, పండుగ దినాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజులను అదునుగా చేసుకొని రెచ్చిపోతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ, మైనింగ్ అధికారులు మట్టి మాఫియాతో కుమ్మకై అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..! ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నా.. మట్టి తరలింపునకు రెవెన్యూ లేదా మైనింగ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఖాతరు చేయడం లేదు.
రూ.800 నుంచి వెయ్యి వసూలు...
కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో సేకరించిన మట్టిని పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి వెంట వెలుస్తున్న వెంచర్లకు, పలు ప్రైవేట్ వ్యాపార భవన సముదాయాలకు ట్రిప్పునకు 800 నుంచి రూ. 1000లకు జేసీబీల సహాయంతో ట్రాక్టర్ ల ద్వారా అక్రమంగా మట్టిని తరలించి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. రాత్రి పగలు వేళల్లో జేసీబీల సాయంతో, టిప్పర్లతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు జోక్యం చేసుకొని అక్రమ మట్టి దందాను అరికట్టి ప్రభుత్వానికి రాబడి తేవాలని ప్రజల కోరుతున్నారు.
అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు.. కూసుమంచి కరుణా శ్రీ, తహశీల్దార్..
గురువాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో పట్టా ల్యాండ్ కలిగిన ఓ రైతు భూమిలో ల్యాండ్ డెవలప్మెంట్ పేరుతో అక్రమంగా తరలిస్తున్న మట్టి తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిన వెంటనే సిబ్బందిని పంపించాం. అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. మండలంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పట్టా ల్యాండ్ అయినా, ప్రభుత్వ ల్యాండ్ అయిన సరే పర్మిషన్ తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటాం.