ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కరువు.. రోగులను పట్టించుకోని వైద్యులు..

ఆపద వచ్చిందని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళితే ఓ మహిళ పై డ్యూటీ డాక్టర్లు వృత్తి ధర్మాన్ని మరిచి ముచ్చట్లు పెట్టుకుంటూ.. పేషేంట్ ను పట్టించుకోని సంఘటన జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో చోటు చేసుకుంది.

Update: 2024-07-20 11:15 GMT

దిశ, ఖమ్మం రూరల్ : ఆపద వచ్చిందని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళితే ఓ మహిళ పై డ్యూటీ డాక్టర్లు వృత్తి ధర్మాన్ని మరిచి ముచ్చట్లు పెట్టుకుంటూ.. పేషేంట్ ను పట్టించుకోని సంఘటన జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. బాధితులు తెలిసిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి.వెంకటమ్మ (70) శుక్రవారం కూలి పనిలో భాగంగా పొలంలో పనికి వెళితే పాము కాటు వేసింది. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళితే ఓపి రాయడానికి సుమారు 15 నిమిషాలు.. ఆ తరువాత మళ్ళీ లోపలికి వెళితే టెస్ట్లు చేయించుకొని రండి అంటూ ఆ తర్వాత ఫైల్ తీసుకొని రండి అంటూ టైం వేస్ట్ చేసిన ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారని బాధిత మహిళ వాపోయింది. కనీసం పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీలోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ.. దురుసుగా సమాధానం చెప్పడంతో పాటు పేషేంట్ తరపు బంధువుల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.

ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే ఇంటిదారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్న ఇలాకలో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్ల పై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైనది కాదని ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడటం సరైనది కాదని, దీనిపై జిల్లా వైద్యశాఖ తక్షణమే చర్యలు తీసుకొని పేషంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. తన లాగా వేరొక పేషెంట్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News