ఖమ్మం నగరానికి జోనల్ వ్యవస్థ
పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దిశ, ఖమ్మం సిటీ; పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒకే కార్యాలయం ద్వారా 60 డివిజన్ల ప్రజలకు పౌర సేవలు అందించబడుతున్నాయి. అయితే, మహానగరాలకు ధీటుగా పాలనను వికేంద్రీకరించి పౌర సేవలను మరింత సమీపంగా తీసుకురావడానికి ఖమ్మం నగరంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో, శుక్రవారం కమిషనర్ ఇతర అధికారులతో కలిసి నగరంలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోనల్ కార్యాలయాల ఏర్పాటు కోసం అనువైన భవనాలను పరిశీలించారు. గొల్లగూడెం, చర్చి కాంపౌండ్, 3 టౌన్, పాత మున్సిపల్ కార్యాలయాలు వంటి ప్రభుత్వ భవనాల ప్రాథమిక సమీక్ష పూర్తయింది. ప్రతి జోనల్ కార్యాలయం లో రెవెన్యూ, ఇంజనీరింగ్, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్, పవర్ సర్వీసులు వంటి విభాగాలకు చెందిన 17 మంది అధికారుల బృందం సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ చర్యల ద్వారా ఖమ్మం నగర ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన పౌర సేవలు అందనున్నాయి.