నీలివిప్లవంతో మత్స్యకారుల ఆదాయం పెంపు

నీలి విప్లవంతో మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Update: 2024-10-15 15:02 GMT

దిశ, ఖమ్మం : నీలి విప్లవంతో మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మంత్రి ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లిలో పర్యటించి రాయనిచెరువులో 26 వేల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మత్స్యకారులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వారికి జీవనోపాధి కల్పించడం కోసం ప్రభుత్వం నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 212 మత్స్యకార సహకార సంఘాలు, 16 వేల మంది సభ్యులు ఉన్నారని, వీరందరికీ ఉపయోగపడే విధంగా 300 పైగా చెరువులలో సుమారు 60 లక్షల చేప పిల్లలు ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు.

     జిల్లా మొత్తం దాదాపు రూ. 150 కోట్ల చేపల వ్యాపారం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారని, ఇది చాలా సంతోషకరమని అన్నారు. గతంలో మనం ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ నుంచి చేపలు తెచ్చుకునే వారమని, ఇప్పుడు మన చేపల కోసం ఇతర ప్రాంతాల ప్రజలు వస్తున్నారని తెలిపారు. మన దగ్గర నీలి విప్లవం రావాలని, ఇతర రాష్ట్రాలకు మన చేపలను ఎగుమతి చేయాలని, చేపల మార్కెటింగ్ కు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చేపలు వాసన రాకుండా, కరాబు కాకుండా వాహనాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో ఉన్న చెరువులను వచ్చే వేసవి కాలం కొలిచి ఆక్రమణలు జరగకుండా ట్రెంచ్ కొట్టించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

     రైతులంతా ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయాలని, 3 సంవత్సరాల వరకు అంతర్ పంటల ద్వారా ఆదాయం వస్తుందని, ప్రతి ఎకరానికి ప్రభుత్వం తరపున 50 వేల రూపాయల సబ్సిడీ అందిస్తామని అన్నారు. ఒక్క పంట వేస్తే మన ఖర్చులకు నేడు సరిపోవడం లేదని, మంచి లాభదాయక పంటలను సాగు చేయాలని మంత్రి రైతులకు సూచించారు. మన పిల్లలను చదివిస్తే అదే వారిని గొప్ప స్థాయికి చేరుస్తుందని అన్నారు. పిల్లలపై ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలని, వాళ్లు ఏం చేస్తున్నారో గమనించాలని, గంజాయి వంటి చెడు అలవాట్ల బారిన పడకుండా కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వి. రవి కుమార్, ఇన్చార్జి జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, మత్స్య సంఘం ప్రతినిధులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News