చెరువు భూముల్లో అక్రమ కట్టడాలు.. కాలువలు సైతం వదలని కబ్జాదారులు

కొత్తగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో కొందరు కబ్జాదారులు సమీపంలో ఉన్న చెరువులను కుంటలను కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దారుణ దుస్థితి నెలకొనడంపై చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-08-29 02:50 GMT

చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీకి అనుకుని ఉన్న చింతలచెరువు దశలవారీగా ఆక్రమణలకు గురవుతున్నది. సుమారు 10ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు దాదాపుగా ఆరు ఎకరాలకు కుచించుకుపోయినట్లుగా తెలుస్తున్నది. ఈ చెరువుకు గతంలో నాలుగు కాలువలు ఉండగా ప్రస్తుతం ఒకటి మాత్రమే మిగిలింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండి ఒకే కాల్వ ద్వారా బయటికి రావడంతో కొత్తగూడెం-ఖమ్మం జాతీయపైకి వరద చేరి చెరువును తలపించింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో మినీ ట్యాంక్ బండ్ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో చెరువు పూర్వ వైభవం కోల్పోవడంతో పాటు వాకింగ్ ట్రాక్ కనుమరుగై శిథిలావస్థకు చేరుకుంది. పక్కనే అమ్మవారి గుడి ఉండగా చెరువు దుస్థితితో పూజలకు నోచుకోని పరిస్థితి నెలకొన్నది. ఇలాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఈ చెరువు మిగులుతుందా మిగలదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో కొందరు కబ్జాదారులు సమీపంలో ఉన్న చెరువులను కుంటలను కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దారుణ దుస్థితి నెలకొనడంపై చర్చనీయాంశంగా మారింది. చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీకి అనుకొని ఉన్న చింతలచెరువు దశలవారీగా ఆక్రమణల పాలవుతుంది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన చెరువు నేడు కలుషితం అవడంతో పాటుగా చెరువు సంబంధించిన భూమి కాలువలు కబ్జాలకు గురి కావడం విచారకరం. సుమారు 10ఎకరాలకు పైగా ఉన్న చింతలచెరువు స్థలం కొద్దికొద్దిగా ఆక్రమణకు గురై దాదాపుగా ఆరు ఎకరాల వరకు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా కొందరు సీనియర్ రాజకీయ నాయకులు బహిరంగంగా పేర్కొనడం గమనార్హం.

కొత్తగూడెం నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న జలగం వెంకట్రావు కాలంలో విద్యానగర్ కాలనీ చింతలచెరువును మినీ ట్యాంక్ బండ్ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేయడంతో పాటు నిధులు సైతం వెచ్చించి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన పదవి కాలం ముగిసిన తర్వాత చింతలచెరువు అభివృద్ధి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా చెరువు పూర్వ వైభవం కోల్పోవడంతో పాటు వాకింగ్ ట్రాక్ కనుమరుగై శిథిలావస్థకు చేరుకుంది. ట్రాక్ చుట్టూ పిచ్చి మొక్కలు భారీగా పెరగడంతో ఆ వాకింగ్ ట్రాక్ మల మూత్ర విస్తర్జనకు ఉపయోగపడుతున్న దుస్థితి నెలకొంది. చెరువు కట్ట పక్కనే అమ్మవారు టెంపుల్ కూడా ఉండగా చెరువు దుస్థితితో పూజలకు నోచుకోని పరిస్థితి ఉంది. రాను రాను చెరువు వైభవం తగ్గిపోవడంతో భవిష్యత్తులో ఈ చెరువు మిగులుతుందా మిగలదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

చెరువు కాలువలు కబ్జా...

చింతలచెరువుకు గతంలో నాలుగు కాలువలు ఉండగా ఒకటి మాత్రమే మిగిలి ఉందని దీనివల్ల విద్యానగర్ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు భూమితో పాటుగా కాలువలను ఆక్రమణ చేశారని వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చింతలచెరువు నిండిపోయి వరద నీరు అంతా ఒకే కాల్వ ద్వారా బయటికి రావడంతో ఆ వరద నీరంతా కొత్తగూడెం-ఖమ్మం జాతీయపైకి వచ్చి నిండిపోయి చెరువును తలపించింది. వరద నీరు అంతా రోడ్డుపైకి రావడంతో భారీ వాహనాలతో పాటుగా ద్విచక్ర వాహనదారుల సైతం ఇబ్బంది పడ్డారు. ఇంత జరిగిన చింతలచెరువు సమస్యను పరిష్కరించకపోవడం విమర్శలకు దారితీస్తుంది.

నాడు అభివృద్ధి.. నేడు గ్రహణం...

స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన చింతలచెరువును గత ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పదవి కాలంలో మినీ ట్యాంక్ బండ్‌గా మార్చేందుకు నిధులు మంజూరైన విషయం తెలిసిందే. మంజూరైన నిధులతో చెరువు చుట్టూ విశాలంగా వాకింగ్ ట్రాక్ విశాలమైన కరకట్ట, దేవత మూర్తుల మందిరాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ చెరువుకు గ్రహణం పట్టి సమస్యలకు నిలయంగా మారింది. చింతలచెరువు అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఆదాయ కూడా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

చింతలచెరువును కాపాడండి

భూక్య రమేశ్, సీపీఎం జిల్లా నాయకుడు

పది ఎకరాలకు పైగా చింతలచెరువు ఉండేది. దశలవారీగా ఆక్రమణలకు గురై ప్రస్తుతం సుమారు ఆరు ఎకరాల లోపు మాత్రమే చెరువు స్థలం మిగిలి ఉంది. కబ్జా దారుల నుంచి చెరువును రక్షించాల్సిన అవసరం ఉంది. చెరువుకు అనుకొని ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలి. గతంలో చింతల చెరువును పర్యటక కేంద్రంగా మార్చేందుకు మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు జరుగుతున్న తరుణంలో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. ఈ పనులను తిరిగి ప్రారంభించి పర్యటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేయాలి.


Similar News