ఇల్లందులో జర్నలిస్ట్ సుదర్శన్ పై దాడి.. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలింపు

ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న నిట్ట సుదర్శన్ పై ఇల్లందు మండలంలోని జగదంబ గుంపు వద్ద గురువారం రాత్రి దాడి జరిగింది.

Update: 2024-10-18 17:20 GMT

దిశ, ఇల్లందు : ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న నిట్ట సుదర్శన్ పై ఇల్లందు మండలంలోని జగదంబ గుంపు వద్ద గురువారం రాత్రి దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియా నుండి టు వీలర్‌పై ఖమ్మం కు బయలుదేరిన నిట్ట సుదర్శన్ ..తన బైక్‌ను బంధువుల ఇంటి వద్ద ఉంచి బస్సులో వెళ్దాం అని అనుకున్నాడు. ఈ క్రమంలో కరెంటు ఆఫీస్ ఏరియా నుంచి రెండు బైకులపై ఐదుగురు వ్యక్తులు అతని వెంబడించారు. ఇల్లందు మండలంలోని జగదాంబ గుంపు వద్ద ఉన్న రాజేష్ పాన్ షాప్ వద్ద నిట్ట సుదర్శన్ కళ్ళలో ఇసుక చల్లి బీరు సీసా, ఇనుప రాడ్లతో ఒక్కసారిగా దాడి చేశారు.

అక్కడున్న రాజేష్, పండు అనే వ్యక్తులు వాళ్ళని ఆపి రక్తపు మడుగులో ఉన్న సుదర్శన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం కు తరలించారు. ఈ దాడి పై జర్నలిస్ట్ సంఘాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిట్ట సుదర్శన్ గతంలో తీన్మార్ మల్లన్న గెలుపుకై ఎమ్మెల్సీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలో రౌడీ శీటర్లు, రాజకీయ నేతలతో సుదర్శన్‌కు ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు హత్యాయత్నం కింద ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Similar News