గంజాయి మాయం కేసులో బలిచేశారు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న భూక్యా సాగర్ అనే కానిస్టేబుల్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ..

Update: 2024-10-14 02:35 GMT

దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న భూక్యా సాగర్ అనే కానిస్టేబుల్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో బూర్గంపాడు పోలీస్టేషన్‌లో పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయి మాయమైన ఘటనలో విచారణ చేపట్టిన అధికారులు కానిస్టేబుల్ సాగర్‌ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో గంజాయి చోరీ కేసులో తనను బలి పశువును చేశారంటూ ఆరోపిస్తూ దసరా పండుగ రోజు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో పని చేసిన ఎస్సైలు సంతోష్, రాజ్ కుమార్‌లు, బూర్గంపాడుకు చెందిన బీఆర్ఎస్ యువజన నాయకుడు గొనెల నాని అనే వ్యక్తితో కలిసి గంజాయిని అమ్ముకున్నారని సాగర్ పేర్కొన్నారు. గంజాయి మాయమైన విషయంలో ఎస్ఐల పాత్ర ఉందని వారిని వదిలేసి తనపై చర్యలు తీసుకోవడంతో మనస్థాపానికి గురైనట్లు సాగర్ సూసైడ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన స్వగ్రామమైన ఏన్కూరులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు వైద్యం కోసం సాగర్‌ను ఖమ్మం అక్కడ నుంచి  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆది నుంచి వివాదాలే..

బూర్గంపాడు పోలీసు స్టేషన్ల ఆది నుంచి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత పదేళ్లలో ఇక్కడ విధులు నిర్వహించడానికి అధికారులు, రాజకీయ నాయకుల పలుకుబడితో ఎస్ఐలు పోస్టింగ్ తెప్పించుకునేవారని తెలుస్తోంది. ఈ పదేళ్లలో ఈ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నో గంజాయి కేసులు నమోదయ్యాయి. ఈ గంజాయి కేసుల్లో పట్టుబడిన గంజాయిని అప్పటి పాత పోలీసు స్టేషన్లో కోర్టులో రిమాండ్ నిమిత్తం ఉంచారు. ఈక్రమంలో ఈ పోలీసు స్టేషనుకు ఎటువంటి రక్షణ లేకపోవడంతో అదికాస్తా అక్రమార్కులకు వరం మారింది. గతంలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ సంతోష్, రాజ్ కుమార్ సహకారంతో ఈ బీఆర్ఎస్ నాయకుడు గోనెల నాని తన అనుచరులు, బంధువులతో పట్టుబడిన గంజాయిని తరలించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రోజు రాత్రి పాత పోలీసు స్టేషన్‌లో నిల్వ ఉంచిన గంజాయి తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో అసలు దొంగలు ఎస్ఐ, బీఆర్ఎస్ నాయకుడు ఇందుకు సంబంధం లేని కానిస్టేబుల్‌ను బాధితుడిగా చేసి పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కానిస్టేబుల్ సాగర్‌ను గంజాయి కేసులో ఇరికించి సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన కానిస్టేబుల్ సాగర్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు.

పలుకుబడితో పోస్టింగ్

బూర్గంపాడు పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించడానికి గతంలో పని చేసిన ఎస్ఐ సంతోష్... విలేకరులు, రాజకీయ నాయకుల పలుకుబడితో పోస్టింగ్ వేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి పోస్టింగ్‌పై వచ్చిన ఎస్ఐ సంతోష్ బీఆర్ఎస్ నాయకుల చెప్పుచేతల్లో పని చేస్తూ అమాయకులను పలు కేసుల్లో ఇరికించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఎస్ఐను వీఆర్‌స్‌కు పంపించి రాజ్ కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. కాగా రాజ్ కుమార్ కూడా ఎస్ఐ సంతోశ్ అడుగుజాడల్లో నడిచి అక్రమార్కులకు సహకారం అందించారనే అపవాదు ఉంది. దీంతో బీఆర్ఎస్ నాయకుడు తన అనుచరులు, బంధువులతో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. ఈక్రమంలో కానిస్టేబుల్ సాగర్ ఈ కేసులో బలియైపోయారు.


Similar News