నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం : జెడ్పీ చైర్మన్‌ మధూకర్

మంథని నియోజకవర్గంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

Update: 2023-02-20 10:23 GMT

దిశ, మంథని : మంథని నియోజకవర్గంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని ఎస్‌ఎల్బీ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌ మేళాను సోమవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ,భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ప్రారంభించారు. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల నుంచి ఎంతో మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

     తమ పిల్లలు ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు రావడం లేదని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని ఈ ప్రాంత తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకురావడంతో ఈ జాబ్ మేళాను పెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగ కలల సాకారం కోసం తమ విద్యార్హతకు తగిన ఉద్యోగం ఎంపిక కోసం పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 52 బహుళజాతి కంపెనీల సహకారంతో జాబ్‌ మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో జాబ్‌మేళా ద్వారా ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సుదూర ప్రాంతాలని ఆ అవకాశాలను వదులుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ జాబ్‌ మేళాలో మాత్రం ప్రతి ఒక్కరూ తమ విద్యార్హతకు తగిన ఉద్యోగ అవకాశాలను ఆయా కంపెనీలలో ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం పట్టణాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు ఉండేవని, అలాంటి పరిస్థితులు ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు రావద్దన్నదే తమ ఆలోచనతో ఈ జాబ్ మేళాను నిర్వహించమన్నారు.

     పదేళ్ల క్రితం నుంచి తనతల్లి పేరిట పుట్ట లింగమ్మ ట్రస్టును స్థాపించి పేద బడుగు బలహీనవర్గాలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లోని పేద విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతోందన్నారు. అలాగే విద్యార్ధుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించే దిశగా ప్రతి కళాశాల, మోడల్‌ స్కూల్‌ల్లో మోటివేషన్‌ అండ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ మేళాలో ఉద్యోగ అవకాశాలు వచ్చిన వారు తమ వేతనం ద్వారా ప్రతి నెలా ఒక్క రూపాయి పుట్ట లింగమ్మ ట్రస్టుకు విరాళంగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో భూపాలపల్లి జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ మాట్లాడుతూ ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య నిర్మూలించేందుకు జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు గొప్పగా ఆలోచన చేసి పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా మెగా జాబ్‌ మేళాను ఏర్పాటు చేయడం అదృష్టంగా భావించాలన్నారు. నిరుపేద వర్గాల అభ్యున్నతి కోసం గొప్పగా ఆలోచన చేసే నాయకుడు పుట్ట మధు అని, అలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కొండ శంకర్, జక్కుల ముత్తయ్య, ఆరెల్లి దేవక్క, జెడ్పీటీసీ సభ్యురాలు తగరం సుమలత, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News