యథేచ్ఛగా కలప అక్రమ రవాణా.. రాత్రి వేళ ట్రాక్టర్లలో తరలింపు
మండలంలో కలపను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు రూ.లక్షలు గడిస్తున్నారు.
దిశ, ముస్తాబాద్: మండలంలో కలపను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు రూ.లక్షలు గడిస్తున్నారు. ముస్తాబాద్లో అక్రమార్కుల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అనుమతుల పేరిట కలప వ్యాపారస్తులు చెట్లను పగలు నరికివేసి వాటిని ఓ రహస్య ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. ఒకవేళ అనుమతులు ఉన్న కూడా వాటి పరిధిని మించి కలపను నరికివేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ భూముల్లో, అడవుల్లో సైతం గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికివేస్తూ రహస్య ప్రాంతంలో డంప్ చేసి వాటిని ట్రాక్టర్లలో రాత్రుల్లో అక్రమంగా చేరాల్సిన చోటికి సురక్షితంగా చేరుతున్నాయి.
అయితే, ఈ అక్రమ తరలింపులో విలువైన టేకు కలప కూడా తరలి వెళ్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మండలంలో యథేచ్ఛగా కలప, టేకు అక్రమ తరలింపు జరుగుతున్నా.. కూడా అటవీ అధికారులు ఇప్పటి వరకు తనిఖీలు చేసి టేకు కలపను పట్టుకున్న దాఖలాలైతే లేవు. తనిఖీలు చేపట్టకపోవడంపై అటవీ అధికారులపై అనుమానాలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. అక్రమ కలప తరలింపు విషయం అటవీ అధికారులు లంచాలు తీసుకుని వారి కనుసన్నల్లోనే అక్రమ తరలింపు జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి.
అటవీ శాఖ అధికారులు మామూళ్లు వసూలు చేస్తూ కలపను అక్రమంగా తరలించడంలో పాత్ర వహిస్తున్నారని వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. చేయి తడిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేని పక్షంలో వేలకు వేలు అపరాధ రుసుం వేసి ట్రాక్టర్ను సీజ్ చేస్తామని అంటున్నారని వారు వాపోయారు. అటవీ అధికారులు నిర్లక్ష్యం వీడి మండలంలో నిల్వలు ఉన్న కలప డంప్లపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మండలంలో ఉన్న కట్టెకోత సామిల్లలో కూడా భారీగా కలప నిల్వ ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వాటిపై కూడా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.