లంచం అడిగితే నాకు చెప్పండి.. ప్రజలకు దక్షిణ డిస్కం సీఎండీ అప్పీల్!

విద్యుత్ శాఖలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే తన కార్యాలయానికి తెలియజేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.

Update: 2024-09-06 16:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే తన కార్యాలయానికి తెలియజేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు శుక్రవారం ఆయన తెలిపారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో సిబ్బంది, అధికారులు లంచం అడిగితే 040-2345 4884 లేదా 76809 01912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయాలని విద్యుత్ వినియోగదారులకు తెలిపారు. సంస్థ తమ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తోందని పేర్కొన్నారు. కొంతమంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డపేరు తెస్తున్నారని, ఈనేపధ్యంలోనే వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ స్పష్టంచేశారు. ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, కేటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్ సైట్, మొబైల్ యాప్ ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణ కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి ఉందన్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ హెచ్చరించారు.


Similar News