చంద్రబాబు అలాంటి కుట్రలు చేస్తే ఆ పార్టీ కూడా గల్లంతే!.. సినీ నటి విజయశాంతి హాట్ కామెంట్స్

చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వచ్చారని అంతా అనుకున్నారు కానీ టీడీపీ ప్రయోజనాలే రహస్య ఎజెండాగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుందని, అలాంటి కుట్రలు చేస్తే ఆ పార్టీ కూడా గల్లంతయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు.

Update: 2024-07-08 15:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వచ్చారని అంతా అనుకున్నారు కానీ టీడీపీ ప్రయోజనాలే రహస్య ఎజెండాగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుందని, అలాంటి కుట్రలు చేస్తే ఆ పార్టీ కూడా గల్లంతయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ అనంతరం ఏపీ సీఎం చంద్రాబాబు టీడీపీ భవన్ లో చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందని అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే, తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తెలంగాణాలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు. కానీ తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణల బలపడటానికి కుట్రలు చెయ్యడానికి ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు తప్పక ఏర్పడి తీరుతాయని స్పష్టం చేశారు. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం భవిష్యత్తులో నిశ్చయమవుతుందనేది వాస్తవమని విజయశాంతి ఎక్స్ వేదికగా హెచ్చరించారు.


Similar News