ఉపా కేసును తక్షణమే ఎత్తివేయాలి

ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షాకత్ హుస్సేన్లపై ఢిల్లీ పోలీసులు మోపిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.

Update: 2024-06-26 13:54 GMT

దిశ, సికింద్రాబాద్ : ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షాకత్ హుస్సేన్లపై ఢిల్లీ పోలీసులు మోపిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. వారిపై కేసు నమోదుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి మంజూరు చేయడాన్ని ఖండిస్తూ ఓయూ విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో 'అరుంధతిరాయ్​పై ఉపా కేసు వాస్తవాలు' అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని పొలిటికల్ సైన్స్ సెమినార్ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుంధతిరాయ్ రచయిత్రిగా దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలపై నిరంతరం తన కలం, గళంతో దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రజల పక్షాన నిలబడిన ధీరవనిత అని కొనియాడారు. ఆమె రచించిన రచనలు

    ప్రపంచంలో 45 దేశాల భాషల్లోకి అనువదించారని చెప్పారు. మన దేశంలో బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి మహిళా రచయిత్రిగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. నర్మదా బచావో ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని, దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాన్ని తన రచనల ద్వారా తీవ్రంగా విమర్శించిందని వివరించారు. ఈ క్రమంలో 2010 అక్టోబర్ 21న ఢిల్లీలో జరిగిన 'ఆజాదీ ది ఓన్లీ వే' అనే అంశంపై జరిగిన సదస్సులో జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తి, అక్కడి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ఆమె విస్తృతంగా

    చర్చించిన కారణంగా రూట్స్ ఇన్ కాశ్మీర్ సంస్థ సభ్యుడు సుశీల్ పండిత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారని అన్నారు. కార్యక్రమం జరిగిన 14 ఏళ్ల తరువాత ఇప్పుడు కేసు విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేసును తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండ నాగేశ్వర్, విద్యార్ధి నాయకులు కోట శ్రీనివాస్, నెల్లి సత్య, డాక్టర్ వంశీధర్, నాగేశ్వరరావు, సతీశ్, వలిగొండ నరసింహ, తాళ్ల అజయ్, రవినాయక్, సుమంత్, శ్రీనివాస్, అజయ్, భగత్, పవన్, అశ్వన్, రమేశ్, కోటి, రుక్సత్ పాషా, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Similar News