డిజిటల్ అరెస్టు తో కలవర పెట్టిన.. ప్రధాన సూత్రధారి జుబేర్ అరెస్టు

దుబాయ్ కేంద్రంగా డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను దోచుకుంటున్న ప్రధాన సూత్రధారిని శనివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు

Update: 2025-03-15 16:04 GMT

దిశ, సిటీక్రైం : దుబాయ్ కేంద్రంగా డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను దోచుకుంటున్న ప్రధాన సూత్రధారిని శనివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ కింగ్ పిన్ దుబాయ్ లో మకాం వేసి తన అనుచరులతో బ్యాంక్ ఖాతాలను తెరిపించి వాటి ద్వారా దేశవ్యాప్తంగా 124 కేసులలో బాధితులను నిండా ముంచాడు. అందులో తెలంగాణకు చెందిన 23 మంది బాధితులు ఉన్నారు. సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి గత ఏడాది జూలై నెలలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ కార్డు ఐడితో ముంబాయి నుంచి ఇరాన్ కు 130 ఎల్ఎస్ డి షీట్స్, 2 లాప్ టాప్ లు, 6 కేజీల బట్టలు, 2 లాప్ టాప్ లు, 7 పాసుపోర్టులు, 4 క్రెడిట్ కార్డులు వెళ్తున్నాయని పోలీసులు, కస్టమ్స్ అధికారులు గుర్తించారని తెలిపి స్కైప్ వీడియో కాల్ ద్వారా ముంబయి పోలీసులు మాట్లాడుతున్నారని భయపెట్టించి మిమ్మల్ని అరెస్టు చేస్తామని కలవరానికి గురి చేశారు.

ఈ కేసును నుంచి క్లీన్ గా బయటపడాలంటే మీరు మీ ఖాతాల్లో ఉన్న డబ్బులతో పాటు ఆర్థిక లావాదేవీల వివరాలను ఇవ్వాలని ఆందోళనకు గురి చేశారు. దీంతో బాధితుడు మొత్తం వారి చెప్పినట్లు 55 లక్షలు బదిలీ చేశాడు. తర్వాత మోసపోయానని భావించి సీసీఎస్ సైబర్ క్రైం లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు బాధితుడి డబ్బు నుంచి బదిలీ అయిన ఖాతాదారులు మీర్ రజాక్ అలీ, మహ్మాద్ సయ్యిద్, జుబేర్, దస్తగిరి షాల ను అరెస్ట్ చేశారు. విచారణలో వీరంతా కమీషన్ ల మీద ఖాతాలను దుబాయ్ లో ఉన్న మహ్మద్ జుబేర్ కు అందించామని చెప్పారు. దీంతో పోలీసులు మహ్మద్ జుబేర్ మీద ఎల్ఓసీ(లుక్ ఔట్ నోటీసు)జారీ చేశారు.

దీంతో జూబేర్ ఈ రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్ రావడంతో అతని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విచారణలో జుబేర్ డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను టార్గెట్ చేసి వారి నుంచి కొట్టేసిన డబ్బులను తన అనుచరులు ఇచ్చిన ఖాతాల్లోకి మళ్ళించి వాటిని దుబాయ్ లో విత్ డ్రా చేసుకుంటున్నట్లు తేలింది. అతనికి దుబాయ్ తోడుగా సాదిక్ సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సాదిక్ దుబాయ్ లో ఉన్నాడని విచారణలో బయటపడింది. అరెస్టైన ప్రధాన సూత్రధారి జుబేర్ నుంచి 2 ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఎవరూ కూడా డిజిటల్ అరెస్టు అంటూ ఫోన్ చేస్తే అది సైబర్ మోసమని గుర్తించాలని కోరుతున్నారు.


Similar News