TG Assembly: బకాయిలపై రచ్చ! ఫీజు రీయింబర్స్మెంట్పై అసెంబ్లీలో వాడీవేడి చర్చ..
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉదయం సభలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వాడీవేడి చర్చ జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో (Telangana Assembly) భాగంగా ఇవాళ ఉదయం సభలో ఫీజు రీయింబర్స్మెంట్ (fee reimbursement) బకాయిలపై వాడీవేడి చర్చ జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క (Minister Seethakka) సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.8,029 కోట్లకుపైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.5,520.60 కోట్ల బకాయి ఉందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4,341 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిందన్నారు. దీంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను దశల వారీగా తీరుస్తున్నామని స్పష్టం చేశారు. కాలేజీల యాజమాన్యం పిల్లల సర్టిఫికెట్స్ ఇవ్వడం ఆపొద్దని కోరారు. యాజమాన్యాలకు భరోసా కల్పిస్తామని, ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాజమాన్యాలతో మాట్లాడారని చెప్పారు. ప్రస్తుతం పంట రుణమాఫీ పథకం లాంటి వాటికి నిధులు విడుదల చేయడంతో మిగతా శాఖలపై కొద్దిగా భారం పడుతోందని చెప్పారు. దాదాపు రూ.1,200 కోట్లకు టోకెన్స్ కూడా రైజ్ చేసినట్లు తెలిపారు. బిల్స్ అనేవి కంటిన్యూ ప్రాసెస్ అని, దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
నాడు కాంగ్రెస్ కూడా బకాయి పెట్టింది : హరీశ్రావు
చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2వేల కోట్లు బకాయిలు పెట్టి పోయిందని కౌంటర్ ఇచ్చారు. వాటిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము చెల్లించామని గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి వాటి వల్ల ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం రూ.2వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.20వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసినట్లు వివరించారు.
విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు : కూనంనేని
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీల చుట్టూ తిప్పుకుంటున్నారని తెలిపారు. బకాయిల వల్ల కొన్ని చిన్న కాలేజీలు నడపడం కష్టంగా ఉందని, పలు కాలేజీలు మూతబడ్డాయని చెప్పారు. వెంటనే బకాయిలు క్లియర్ చేయాలని కోరారు.
గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అద్దె, కరెంట్ బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు క్లియర్ చేయాలని కోరారు.
ఈ ఏడాదే మొత్తం క్లియర్ చేయాలి: పాల్వాయి
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ.. ఈ ఏడాదే మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్కు అరకొర నిధులు కేటాయించడం సరికాదని, బకాయిలు ఇంకా పేరుకుపోయే ప్రమాదం ఉందని సూచించారు.
టీ ప్రైడ్ కింద 45 శాతం రాయితీ: మంత్రి శ్రీధర్బాబు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల లోపు మూడో వంతు రాయితీ ఇస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు (Sridhar Babu) తెలిపారు. పారిశ్రామిక వినియోగం కోసం భూ మార్పిడి చార్జీలు రూ.10 లక్షలకు పరిమితం చేశామన్నారు. యూనిట్కు రూ.1.50 చొప్పున నిర్ణీత విద్యుత్ రీయింబర్స్మెంట్ ఉంటుందన్నారు. రూ.కోటి పరిమితితో ఐఐడీఎఫ్ నుంచి మౌలిక సౌకర్యాల కల్పన ఉంటుందని స్పష్టం చేశారు.
పని చేసినా మీలా ఎక్కువ మాట్లాడం : మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో మొత్తం 29 వేల కిలోమీటర్ల మేర రహదారులున్నాయని, మన రహదారులే మన సంపదను పెంచుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. పీపీపీ విధానం వేరు.. హైబ్రిడ్ యాన్యుటీ విధానం వేరని తెలిపారు. గత పదేళ్లలో రోడ్డపై రూ.3,945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. గతంలో రోడ్ల కోసం తెచ్చిన రుణాల బకాయిలు చెల్లిస్తున్నామని మంత్రి అన్నారు. తాము పని ఎక్కువ చేస్తాం.. కానీ మీలా ఎక్కువ మాట్లాడలేమని బీఆర్ఎస్ సభ్యులపై సెటైర్లు వేశారు.
సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్..
మంత్రి కోమటిరెడ్డి సమాధానాన్ని నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఇతర విషయాలు ప్రస్తావించారని బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. బీఆర్ఎఎస్ హయాంలో చేసిన రోడ్ల గణాంకాలు స్పీకర్ సమక్షంలో పెట్టాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ సమక్షంలో పెట్టాలని డిమాండ్ చేసినా స్పందించలేదని బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.