Katipalli: రాజీనామాలపై సవాళ్లు కాదు ముందు హౌస్ కమిటీ వేయండి.. ఎమ్మెల్యే కాటిపల్లి డిమాండ్

విద్యుత్ అంశంలో అవినీతిపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-29 10:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీలో విమర్శలు, ప్రతివిమర్శలతోనే సరిపోతున్నదని ప్రజాసమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలు సరికాదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ తాను అసెంబ్లీకి కొత్త సభ్యుడినే కాని రాజకీయాలకు కొత్త కాదన్నారు. విద్యుత్ అంశంలో అవినీతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజీనామాలకు సిద్ధం అవుతున్నాయని, అందువల్ల ఈ విషయంలో హౌస్ కమిటీ వేసి విచారణ చేస్తే నిజం తేలుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించామే కంటే రైతులకు ఎంత సౌకర్యాలు కల్పిస్తున్నామన్నదే ముఖ్యం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుకు కావాల్సిన విద్యుత్ అందడం లేదన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ డిపోలను ఏర్పాటు చేయలేదన్నారు. ఇంకా ఉమ్మడి జిల్లాల్లోనే డిపోలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు.

ఇళ్ల మీద ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను తొలగించడం లేదని ఇది ఆలోచించాల్సిన విషయం అన్నారు. కామారెడ్డితో పాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నారు. డీడీలు కట్టినప్పటికీ ట్రాన్స్ ఫర్మార్లు రావడానికి ఏడాది నుంచి ఆర్నెళ్ల సమయం పడుతున్నదన్నారు. దీని వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. కిందిస్థాయి ఉద్యోగులను ఆర్టిజన్ లుగా గుర్తించాలని, విద్యుత్ మీటర్ల రీడింగ్ చేస్తున్న వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దని కోరారు. ఉదయ్ స్కీమ్ కింద రైతుల మోటార్లకు మీటర్లు పెట్టినా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే ఇవ్వొచ్చు అన్నారు. స్మార్ట్ మీటర్లు లేకపోతే జవాబుదారితనం లేకుండా పోతుందన్నారు.

Tags:    

Similar News