ఏడుపాయల వన దుర్గామాత గర్భగుడిలోకి వరద నీరు..ఆలయం మూసివేత
మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వరుసగా రెండో రోజూ కూడా జలదిగ్భందంలోనే ఉండిపోయింది.
దిశ, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వరుసగా రెండో రోజూ కూడా జలదిగ్భందంలోనే ఉండిపోయింది. మంజీరా బ్యారేజీ, నక్కవాగు నీటి విడుదలతో వన దుర్గామాత ఆలయ గర్భ గుడిలోకి వరద నీరు చేరింది. దీంతో ఆలయం మూసివేత కొనసాగుతుంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి పూజలు కొనసాగిస్తున్నారు. ఆలయం వద్ద మంజీరా నది వరదకు నక్కవాగు ప్రవాహం తోడై వరద ఉదృతంగా కొనసాగుతోంది. ఈ నెలలో కురిసిన భారీ వర్షాలతో 12 రోజుల పాటు ఏడుపాయల ఆలయం మూతపడింది. మరో వైపు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరుగడంతో ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగిస్తున్నారు.