మైనింగ్ రంగంలో పెట్టుబడులకు సానుకూలత : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణలో మైనింగ్ రంగంలో పెట్టుబడులకు అమెరికా సహా పలు దేశాల కంపనీలు ఆసక్తి కనబరిచాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Update: 2024-09-25 08:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మైనింగ్ రంగంలో పెట్టుబడులకు అమెరికా సహా పలు దేశాల కంపనీలు ఆసక్తి కనబరిచాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని లాస్ వేగాస్ న‌గ‌రంలో నిర్వహిస్తున్న ప్రపంచ అతిపెద్ద మైనింగ్ ఎక్స్ పో 2024ను భ‌ట్టి విక్రమార్క త‌న బృందంతో క‌లిసి సంద‌ర్శించారు. మైనింగ్ ప‌రికరాల త‌యారీదారుల‌తో, యూఎస్ ప్రభుత్వంలోని వివిధ అత్యున్నత స్థాయి అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మైనింగ్ ఎక్స్ పో విశేషాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. పరికరాల తయారీదారుల ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశమైన లాస్ వెగాస్‌లోని మైనింగ్ ఎక్స్ పోలో తెలంగాణ ప్రభుత్వం తరుపున భాగస్వామ్యమవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఆ మైనింగ్ ఈవెంట్ లో తాజా మైనింగ్ ఆవిష్కరణలు, సాంకేతికతలు, యంత్రాల ప్రదర్శన, పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్‌కు అవకాశాలపై అవగాహానకు వేదికైందన్నారు. 125 కంటే ఎక్కువ దేశాల నుంచి 44,000 మంది నిపుణులు హాజరైనట్లుగా తెలిపారు. మైనింగ్ రంగం అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ఆమెరికా, భారత్ భాగస్వామ్యం భవిష్యత్తును మరింత ఆశాజనకం చేస్తుందన్నారు.

అమెరికా ప్రతినిధులతో చర్చల్లో ప్రతినిధి బృందం నాయకుడు అరుణ్ వెంకటరామన్, గ్లోబల్ మార్కెట్స్ అసిస్టెంట్ సెక్రటరీ, ఒలిమర్ రివెరా నోవా, సీనియర్ పాలసీ అడ్వైజర్, శ్రీ శంతను సర్కార్, కమర్షియల్ స్పెషలిస్ట్, కార్నెలియస్ గ్యామ్ఫీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ స్పెషలిస్ట్, డెరెక్ ష్లికీసెన్, గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ లీడ్, జాస్మిన్ బ్రాస్వెల్, గ్లోబల్ డిజైన్ కన్స్ట్రక్షన్ ట్రేడ్ స్పెషలిస్ట్ లు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించనున్న నాల్గవ నగరం ప్రణాళికలను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఇంజన్‌గా హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యతను, హైదరాబాద్‌లోని అమెరికన్ కంపెనీల పురోగతిని ఈ సమావేశంలో భట్టి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రతినిధుల బృందం సానుకూలత తెలుపడంతో చర్చలు ఫలప్రదమైనట్లుగా భట్టి తెలిపారు. 


Similar News