ముందు వారు ప్రాణాలతో ఉన్నారో లేదో తేల్చండి..! ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
ఘటన జరిగి నెలరోజులైనా వారి జాడ తెలియడం లేదా..?, వారు ప్రాణాలతో ఉన్నారో, లేదో తేల్చండి అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఘటన జరిగి నెలరోజులైనా వారి జాడ తెలియడం లేదా..?, వారు ప్రాణాలతో ఉన్నారో, లేదో తేల్చండి అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) కూలిన ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ సర్కార్ (Congress Government) పై ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి నేటికి సరిగ్గా నెలరోజులు అని, ఆ విషాద ఘటనలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమని, పొట్టకూటి కోసం వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారి గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని, ఎందుకింత జాప్యం జరుగుతున్నది.. కారణాలు అంతు పట్టడం లేదని అన్నారు. సొరంగం కూలడం వెనుక, ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి ఇప్పటికీ బయటకి తీసుకు రాకపోవడం వెనుక ఈ ప్రభుత్వం ఘోర వైఫల్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ భౌతిక శాస్త్రవేత్తల హెచ్చరికలు పెడచెవిన పెట్టి, మొండిగా టన్నెల్ పనులు ప్రారంభించారని, ప్రమాదాన్ని ముందుగా గుర్తించి కూలీలు అప్రమత్తం చేసినా, పట్టించుకోలేదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న తొందరపాటు నిర్ణయం 8 నిండు ప్రాణాలను మృత్యుకుహరంలోకి నెట్టిందని, జరిగిన ప్రమాదానికి, బాధితులు అనుభవిస్తున్న క్షోభకు, వారి కుటుంబాలు పడుతున్న తీవ్ర వేదనకు ముఖ్యమంత్రి (Chief Minister) బాధ్యత వహించాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.
ఇక తమ వాళ్లు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియక, వారి కుటుంబాలన్నీ కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయని, మా వాళ్లు బతికి ఉన్నారా.. మరణించారా? రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని వారంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని తెలిపారు. మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారినయి తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి లేనే లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి, గల్లంతైన వారి జాడ కనుక్కోవాలని కోరారు. నెల రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు బయట పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) డిమాండ్ చేశారు.