Breaking News : ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. మంత్రి వర్గ విస్తరణపై చర్చ!
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపటి క్రితం ఢిల్లీ(Delhi) చేరుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపటి క్రితం ఢిల్లీ(Delhi) చేరుకున్నారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాగా మరికొద్దిసేపట్లో వీరంతా కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో జరగనున్న ఈ సమావేశం రాహుల్ గాంధీ(Rahul Gandhi), కేసీ వేణుగోపాల్(KC Venugopal) ఆధ్వర్యంలో జరగనున్నట్టు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)పై చర్చ జరగనున్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి వంటి విషయాలతో పాటు.. ఉగాది లోపు కేబినెట్ విస్తరణ చేసేందుకు ప్రధానంగా చర్చించనున్నారు.
పండగలోపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో వీటిని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి కేటగిరీలుగా భర్తీ చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో జి.వివేక్, రెడ్డిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనార్టీ కోటాలో అమర్ అలీఖాన్, బీసీ కోటాలో వాకాటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ లతోపాటు అదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరికొద్ది గంటల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.