Bhatti Vikramarka: 'చరిత్ర తెలుసుకుని మాట్లాడు'.. కేటీఆర్ కు భట్టి కౌంటర్

బీఆర్ఎస్ నేతలు సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు.

Update: 2024-08-20 07:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఐటీ రంగానికి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వేసిన పునాదులే కారణం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొని మాట్లాడారు. దేశంలో రాజీవ్ కంప్యూటర్ యుగాన్ని సృష్టించారని, ప్రతి పల్లెకు మంచి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్ తీసుకువచ్చింది, యువత దేశ పరిపాలనలో భాగస్వామ్యం కావాలని 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిందే రాజీవ్ గాంధీ అన్నారు. పారిశ్రామిక విప్లవాన్ని మిస్ చేసుకున్నామని కానీ కంప్యూటర్ విప్లవాన్ని మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో ఆనాడు ప్రధాన మంత్రి హోదాలో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఐటీ సెక్టార్ కు పునాదులు వేశారన్నారు.

రాష్ట్ర విభజన అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారు తమ వల్లే ఈ రాష్ట్రంలో, ఈ దేశం ఐటీ సెక్టార్ లో అద్బుతంగా ముందుకు తీసుకుపోతున్నామని కొంత మంది చెప్పుకుంటున్నారని వారు గత చరిత్ర మర్చిపోయి మాట్లాడతున్నారని కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ లో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతున్నాయంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం అన్నారు. ఇటీవలే సీఎం బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి రూ.36 వేల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంటే ఎంవోయూల కోసం అక్కడి వరకు వెళ్లాలా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కంపెనీలతో ఎంవోయూలు చేసుకుని వస్తేనే పెట్టుబడులు వస్తాయని, అలా కాకుండా మీకు మాదిరిగా ఎక్కడో కోటలో, గడిలో కూర్చుని మాట్లాడితే పెట్టుబడులు వచ్చేవి రాష్ట్రానికి కాదని మీకు మాత్రమే వస్తాయని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో మీరు ఆక్రమించిన చెరువులు, కుంటలను భూములను తొలగించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని, హైడ్రాతో చెరువులు, పార్కుల ఆక్రమణలు తొలగించి ఈ నగర ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్నామన్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధరణిపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించామన్నారు.

Tags:    

Similar News