హర్యానా ఫలితాలపై అనుమానాలు.. ఈసీకి మల్లు రవి రిక్వెస్ట్

హర్యానా ఎన్నికల ఫలితాల వెల్లడిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఈసీని కోరారు.

Update: 2024-10-09 14:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హర్యానా ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలున్నాయని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరిగినా, ఆ వెంటనే బీజేపీ విజయం సాధించిందని ఇందులో ఈవీఎంలలో కొంత గందరగోళం జరిగినట్టు అనుమానాలున్నాయని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ విజయం సాధించిన నియోజక వర్గాలలో ఈవీఎం లో 65 శాతం ఛార్జింగ్ ఉండగా, బీజేపీ గెలిచిన నియోజక వర్గాలలో 99 శాతం ఛార్జింగ్ ఉందని, ఇది ఎలా సాధ్యమో ఈసీ క్లారిటీ ఇవ్వాలన్నారు. హర్యానా ఎన్నికలలో జరిగిన ఫలితాల అవకతవకలపై ఎన్నికల కమిషన్ సమగ్ర వివరణ ఇవ్వాలని అన్నారు.

ఎన్నికల కమిషన్ రౌండ్ల వారీగా వివరాలు ఇవ్వలేదని, మొదట్లో కాంగ్రెస్ కు ఘన విజయం సాధించే సీట్లు వస్తున్నట్టు అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిందని అంతకు ముందు ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉందని, మరి ఎలా బీజేపీ గెలిచిందని ప్రశ్నించారు. ఇలా ఎన్నికలు జరిగితే వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోతుందని, ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.


Similar News