Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఆందోళనలు.. ఓయూ జేఏసీ నేత సీఎంకు కీలక విజ్ఞప్తి

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. తమ సమస్యలను పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా నిరసనలు చేస్తున్నారు.

Update: 2024-09-08 14:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. తమ సమస్యలను పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వైస్‌ ఛాన్సలర్‌ను తొలగించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓయూ జేఏసీ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ వేంకట రమణను తక్షణమే ఇన్చార్జి వీసీ పదవి నుంచి తొలగించాలని సర్దార్ వినోద్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీగా వేంకట రమణ తన రెండేళ్ల పదవీకాలంలో అవినీతి, అక్రమాలు చేశారని, నకిలీ బిల్లుల చెల్లింపుల మీద రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రంలో సంప్రదాయ యూనివర్సిటీలకు పర్మనెంట్ వీసీలను నియమిస్తున్నట్టే బాసర ట్రిపుల్ ఐటీ చట్టాన్ని మార్పులు చేసి ట్రిపుల్ ఐటీకి కూడా పర్మనెంట్ వీసీని నియమించాలని కోరారు. నాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన వెంకట రమణ మీద సత్వరమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ వేంకట రమణ విద్యార్థి వ్యతిరేకి అని, ఆయన వచ్చినప్పటి నుంచి ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అంక్షాల పేరుతో, మెస్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకమైన భోజనం పెడుతూ విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

అలాగే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిక పొగ విద్యార్థుల సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మీద దృష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే వేంకట రమణను మీద విజిలెన్స్ ఎంక్వయిరీ కమిటీ వేసి విచారణ జరిపి చర్యలు చేపట్టాలని సీఎంను కోరారు.


Similar News