PC Ghosh Commission: ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు.. మాజీ ఈఎన్సీపై జస్టిస్ పీసీ ఘోష్ ఫైర్

మాజీ ఈఎన్సీపై జస్టిస్ పీసీ ఘోష్ ఫైర్ అయ్యారు.

Update: 2024-10-24 09:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతున్నది. గురువారం విచారణకు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు తీరుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, నిజాలు, దస్త్రాల ఆధారంగానే సమాధానాలు చెప్పాలని, కమిషన్ ముందు నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. గతంలోనూ నల్లా వెంకటేశ్వర్లును విచారించిన కమిషన్ ఇవాళ మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నది. ఈ సందర్భంగా కాళేశ్వరం డీపీఆర్ నిర్ణయం ఎప్పుడు, ఎవరు తీసుకున్నారు? సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాతే డీపీఆర్ మార్పులు జరిగాయా అని ప్రశ్నించింది. దీనికి మాజీ ఈఎన్సీ బదులిస్తూ.. 2016లో అప్పటి సీఎం ఆదేశాలతో నిర్ణయం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన అంతా నాటి సీఎం కేసీఆర్ దేనని తెలిపారు.సమీక్షకు పిలిచే వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

సీడబ్ల్యూసీ అప్రూవల్ తర్వాత డీపీఆర్ లో మార్పులు జరిగాయా అన్న కమిషన్ ప్రశ్నకు సైట్ కండిషన్ ఆధారంగా డీపీఆర్ లో మార్పులు జరిగాయని బదులిచ్చారు. డీపీఆర్ మోడిఫికేషన్ ఎవరు చేశారని ప్రశ్నించగా ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాల మేరకు డీపీఆర్ లో మార్పులు జరిగాయని నల్లా వెంకటేశ్వర్లు వివరించారు. హై పవర్ కమిటీలో ఎవరెవరు ఉన్నారని ప్రశ్నించింది. అలాగే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల లొకేషన్స్ ఎవరు ఫైనల్ చేశారన్న కమిషన్ ప్రశ్నకు.. 3 ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని వ్యాప్కోస్ సూచించిందన్నారు. ప్రభుత్వం, అధికారుల ప్రమేయం లేకుండానే వ్యాప్కోస్ ఎలా సూచిస్తుందని కమిషన్ ప్రశ్నించింది.


Similar News