అసలైన త్యాగం అంటే ఆయనదే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ విద్యార్థులు IIHTలో చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (IIHT) సీఎం ప్రారంభించారు.

Update: 2024-09-09 08:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యార్థులు IIHTలో చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (IIHT) సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు పదేళ్లుగా బీఆర్ఎస్ చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఈ సంవత్సరమే ఇనిస్టిట్యూట్ మొదలుపెట్టాలని తాము అధికారులను ఆదేశించాం. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి స్కిల్స్ యూనివర్సిటీలో IIHT భవనం ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేత కార్మికుల కళ్లలో ఆనందం చూడాలని రూ.290కోట్ల బకాయిలు విడుదల చేశామని.. గతంలో ఆర్భాటం, సినీ తారల తతళుకు బెళుకులు తప్ప.. నేతన్న ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదని అన్నారు.

గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేసిందని విమర్శించారు. కానీ తాము బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి.. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల కార్మికులను ఆదుకున్నామని అన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారని తెలిపారు. ఏడాదికి ఒక్కో సభ్యురాలికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. మంచి డిజైన్, క్వాలిటీతో ముందుకు రావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఏడాదికి దాదాపు కోటి 30 లక్షల చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇవ్వనున్నామని తెలిపారు. సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. రూ.30 కోట్లున్న చేనేత రుణాలు మాఫీ చేసి చేనేత కార్మికుల రుణ విముక్తులను చేస్తామని అన్నారు. రైతన్న ఎంత ముఖ్యమో మాకు నేతన్న కూడా అంతే ముఖ్యమని తెలిపారు. మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా మీకు అండగా ఉంటా. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగం. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ. IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.


Similar News