నోటిఫికేషన్లు ఆపడానికి బిల్లా, రంగాలు ఆరాటపడుతున్నారు.. కేటీఆర్, హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

తమ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లను ఆపడానికి కేటీఆర్, హరీష్ రావు తెగ ఆరాట పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు.

Update: 2024-10-09 12:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లను ఆపడానికి కేటీఆర్, హరీష్ రావు తెగ ఆరాట పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు బావ, బామ్మరుదులు.. బిల్లా రంగాల లాగా అడ్డం పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 11 వేల ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొరివి దయ్యాల పాలై.. నిరుద్యోగులు ఎన్నో కష్టాల పాలయ్యారని గుర్తు చేశారు. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకుని ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే వారి ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టిలో కలిపింది అన్నారు. గత ప్రభుత్వ సీఎం ఏనాడు కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని.. ఉద్యోగాలు అంటే కేవలం వారి కుటుంబానికి ఉద్యోగం అన్నట్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక 35 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వారి జీవితాల్లో ఆనందం నింపామని గుర్తు చేశారు. టీచర్ల సంఘాలతో కూర్చొని వారి సమస్యలు విని, వాటిని పరిష్కరించామని పేర్కొన్నారు. ఒకవైపు మేము నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఆపాలని చూస్తోందని, తెలంగాణ సమాజం అంటే ఎందుకు అంత కోపం అని ఈ సభా ముఖంగా ప్రశ్నిస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Similar News