NHAI: హైవేల వెంట జీడి తోటలు పెంచండి.. బీజేపీ ఎంపీల విజ్ఞప్తి
ఎన్ఎహ్ఏఐ చైర్మన్ ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రహదారుల వెంట జీటి తోటల పెంపకం చేపట్టాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ (NHAI Chairman) సంతోష్ కుమార్ యాదవ్ కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ (Godom Nagesh)తో పాటు ఎన్ హెచ్ఏఐ చైర్మన్ ను కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల వెంట జీడి పండ్ల తోటల పెంపకం చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. వీటి ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అలాగే టోల్ ప్లాజాల యాజమాన్యాలు మారినా వాటిలో పని చేస్తున్న సిబ్బందిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త సిబ్బంది రాకతో పాత సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారని పాత సిబ్బంది జీవనోపాధి కోల్పోకుండా వారినే కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని రఘునందన్ రావు వెల్లడించారు.