వరద బాధితులకు బిగ్ రిలీఫ్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-09-09 13:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎంత నష్టం వాటిల్లిందన్న విషయంపై ఆరా తీశారు. నష్ట నివారణకు ఎన్ని నిధులు కావల్సిన అంశాలపై పకడ్బందీగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రానికి పంపాల్సిన నివేదికలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వరద ప్రాంతాలలో ఎన్యుమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంపై మంత్రి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల పరంగా జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సాయం అందించాలన్నారు. బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి బాధితుడిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, 33 జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించామన్నారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 మంది మృతి చెందారని, ఇందులో ప్రధానంగా ఖమ్మంలో ఆరుగురు, కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు, కామారెడ్డిలో ముగ్గురు, వనపర్తిలో ముగ్గురు చనిపోయారని అధికారులు వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా అందచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

వెంటనే రూ.5 లక్షలు

ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా కూలిపోయాయి. వీటిని వెంటనే గుర్తించి బాధితులకు రూ.5 లక్షలతో ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

ప్రతి కుటుంబానికి రూ.16,500

వర్షాలలో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500 చొప్పున సాయం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సాయం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే బాధితుల అక్కౌంట్లో జమ చేస్తున్నామన్నారు. వరద సమయంలో సీఎం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారని, అయితే, జరిగిన నష్టాన్ని చూసి మానవతా ధృక్పథంతో రూ.16,500కి పెంచినట్లు తెలిపారు. ఈ సాయాన్ని నేటి నుంచి బాధితులకు అందజేస్తామన్నారు.

ఎకరానికి రూ.10 వేలు

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ.పది వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముప్పుకు గురి కాగా, దాదాపు 2 లక్షల మంది ప్రభావితం అయినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించామని తెలిపారు. 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించారు.

వెంటనే రోడ్ల మరమ్మతులు

భారీ వర్షాలు, వరదలతో ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్ విభాగాలకు సంబంధించి వేలాది కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామీణ మారుమూల ప్రాంతాలలో ఇప్పటికే తాత్కాలిక మరమత్తులు చేపట్టి కొన్ని రోడ్లను పునరుద్ధరించామని, శాశ్వత ప్రతిపాదికన మరమత్తులు చేపట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రెండు మూడు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. అలాగే మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన మరమత్తులను శాశ్వత ప్రతిపాదికన చేపట్టాలని సూచించారు. తాత్కాలిక మరమత్తులతో ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ, ప్రభుత్వ ఆసుపత్రులు, పాటశాలలు, ప్రాథమిక హెల్త్ సెంటర్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న వివరాలను 24 గంటల్లో సచివాలయంలోని ఆయా విభాగాలకు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.

డోంట్ వర్రీ

భారీ వర్షాలు, వరదలకు చాలా ఇండ్లల్లోకి నీరు చేరి ఇంటి యజమాని భూ పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులతో పాటు విలువైన పత్రాలు తడిచిపోయాయి, కొట్టుకుపోయాయి. ఈ బాధితులందరూ స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఆ డూప్లికేట్ పత్రాలను అందిస్తారని ఈ విషయంలో బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పొంగులేటి భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి గింజను కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలి

మైన్స్ కు సంబంధించి వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో పోయడం వల్లనే సూర్యాపేట, పాలేరుకు భారీగా నష్టం జరిగింది. ఆ వ్యర్థాలతో వరద నీరు పోవడానికి వీలు లేకుండా పోయింది. జరిగిన నష్టాన్ని ఆ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. రెండు ఏజెన్సీలు 18 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను పోశారని అధికారులు వివరించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మున్సిపల్, వ్యవసాయ, పంచాయితీరాజ్, విద్యుత్, విద్యా, రోడ్లు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News