అమ్మవారి భక్తులకు బిగ్ అలర్ట్.. జోగులాంబ శరన్నవరాత్రి మహోత్సవాలకు డేట్ ఫిక్స్

Update: 2024-09-25 15:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాససముదాయంలో బుధవారం ఉత్సవ పోస్టర్ ను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఆలయ ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని సౌకర్యాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రసాద్ స్కీం నిధులతో నిర్మించిన నూతన భవనంలో భక్తులకు అన్నదానం, వసతీ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


Similar News