ఏపీ ఇరిగేషన్ అధికారుల దౌర్జన్యం.. క్రస్ట్ గేట్ల వద్ద వాక్వే బ్రిడ్జి తాళం ధ్వంసం
దిశ, నాగార్జునసాగర్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు వదులుతున్నారు. 10 క్రస్ట్ గేట్లను ఐదు అడుగులు మేర ఎత్తి 1,43,518 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 1,87,716 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,87,716 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 588.80 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 308.4658 కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 లుగా కొనసాగుతుంది.
సాగర్లో ఏపీ ఇరిగేషన్ అధికారుల దౌర్జన్యం..
నాగార్జునసాగర్ డ్యామ్ పైనుంచి క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఆంధ్రా అధికారులు ధ్వంసం చేశారు. క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి అనువుగా కొన్నేండ్ల క్రితం వాక్వే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దానికి ఆంధ్రా, తెలంగాణ రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేయగా నిర్వహణ పూర్తిగా తెలంగాణ అధికారులు చేపడుతున్నారు. ఆదివారం ఆంధ్రాకు సంబంధించిన సుమారు 20 మంది అధికారులు ఏపీ సీఎం పేషీ నుంచి వచ్చారు. వాక్వే బ్రిడ్జి గేట్కు తాళం వేసి ఉండటంతో తెలంగాణ ఎన్నెస్పీ అధికారులను తాళం చెవి అడిగారు. దాంతో వారు కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆంధ్రా అధికారులు దౌర్జన్యంతో గేట్ తాళం పగులగొట్టి వాక్వే బ్రిడ్జి మీదికి వెళ్లిపోయారు.
13వ గేట్ వరకు తమ ఆధీనంలో ఉన్నదంటూ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. డ్యామ్పై కంట్రోల్ రూమ్ 26వ గేట్ అవతల ఉన్నదని అక్కడికి వెళ్లి డ్యూటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు ఉన్నతాధికారులకు పంపించినట్టు సమాచారం. ఈ ఘటనపై ఈఈ మల్లికార్జునరావును వివరణ కోరగా ఆంధ్రా అధికారులు తాళం పగులగొట్టిన విషయం తన దృష్టికి వచ్చిందన్నా రు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్యామ్పై పహారా కాస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆంధ్రా నుంచి ఎవరు వచ్చినా అనుమతిస్తున్నది.