సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో బహిరంగ లేఖ

గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శనివారం బహిరంగ

Update: 2024-06-22 15:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని అనుకున్నాను. క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారు.’’ అంటూ హరీశ్‌రావు నిలదీశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మరిచారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో 1.60 (లక్ష అరవై వేల) ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారని, అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటిందని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలను ఇచ్చారే తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అర్తనాదాలు చేయాల్సిన పరిస్థితికి తెచ్చారని చెప్పారు. గ్రూప్ 1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. కనీసం అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు.

గ్రూప్ మెయిన్స్‌కు 1: 50 నిష్పత్తిలో కాకుండా, 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15గా పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారని గుర్తుచేశారు. గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని రేవంత్ మాట ఇచ్చారని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేశారు.


Similar News