ఘనంగా ముగిసిన గంగ నీళ్ల జాతర

సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ మహా అడెల్లి పోచమ్మ గంగ నీళ్ల జాతర భక్తుల పాలిట కొంగు బంగారం, జిల్లా ప్రజల ఇలవేల్పుగా వెలుగొందుతుంది.

Update: 2024-10-06 12:45 GMT

దిశ,సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ మహా అడెల్లి పోచమ్మ గంగ నీళ్ల జాతర భక్తుల పాలిట కొంగు బంగారం, జిల్లా ప్రజల ఇలవేల్పుగా వెలుగొందుతుంది. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లిలోని శ్రీ మహా అడెళ్లి పోచమ్మ ఆలయంలో గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా కొనసాగింది. ప్రతి సంవత్సరం విజయదశమికి ముందు అడెల్లీ పోచమ్మ ఆలయంలో ఈ గంగనీళ్ళ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈయేడు కూడా అంతే వైభవంగా ఈ జాతర కొనసాగింది. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అడెల్లి భక్తి జనసంద్రంగా మారిపోయింది.

అయితే ఈ జాతర విశిష్టత ఏమిటంటే అమ్మవారి నగలను పవిత్ర గోదావరి నదికి తీసుకువెళ్ళి ఆ నదీ జలాలలో వాటిని శుద్ధి చేసి తిరిగి తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించడం. దసరాకు ముందు నుండే ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పలు గ్రామాలకు చెందిన భక్తులు ఆలయ సిబ్బంది, అర్చకుల సమక్షంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారి నగలను ఓ పసుపు బట్టలో మూటకట్టి, ఆ మూటను నెత్తినపెట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారి నగల మూటను నెత్తన పెట్టుకొని పాదయాత్రగా దిలావర్ పూర్ మండలం సాంగ్వి గ్రామంలో గోదావరి నదికి తీసుకువెళ్ళారు. గోదావరి జలాల్లో వాటిని శుద్ధి చేసి మళ్లీ కాలినడకనే అడెల్లికి తిరుగుపయనమయ్యారు.

అమ్మవారి నగలతో సాగిన ఈ ఊరేగింపునకు దారిపొడవున భక్తులు హరతులు పట్టారు. భక్తులు అమ్మవారి నగల మూటను తాకేందుకు పోటీ పడ్డారు. అమ్మవారి నగల మూటను స్పృశిస్తే అంతా మంచి జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి నగలతో గోదావరి నదికి బయలుదేరి వెళ్ళిన భక్తులు తమ వెంట గోదావరి జలాలను తీసుకు వచ్చారు. ఆ నీటిని ఇళ్లలో, పంటపొలాల్లో చల్లితే మంచి జరుగుతుందని వారి నమ్మకం.

మరోవైపు అమ్మవారి నగల మూటతో సాగిన ఊరెగింపును తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో బయలుదేరారు. డప్పు చప్పుళ్లు.. భక్తుల నృత్యాలు.. శివసత్తుల పూనకాలతో ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. దారిపొడవున అమ్మవారి ఆభరణాలపై భక్తులు పసుపు, నీళ్ళు చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకున్నారు. శోభాయాత్ర ఆలయానికి చేరుకున్న అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు అమ్మవారి ఆభరణాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరకు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల హాజరై మొక్కులు తీర్చుకున్నారు.


Similar News