రెసిడెన్షియ‌ల్ స్కూల్లో మంత్రి ఆక‌స్మిక త‌నిఖీలు

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బ‌డి బాట ప‌ట్టారు.

Update: 2022-09-24 14:05 GMT

దిశ, సారంగాపూర్ : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బ‌డి బాట ప‌ట్టారు. సారంగాపూర్ మండ‌లంలోని జాం గ్రామ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శ‌నివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్‌‌లో వంట గ‌ది, భోజ‌న శాల‌, వ‌స‌తి ఇలా అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు.

విద్యార్థుల‌కు అందిస్తున్న భోజ‌న వివ‌రాల‌ను, మెనూను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఇటీవ‌ల ఆహారం క‌లుషిత‌మై విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్న సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో వంట గ‌దిలో ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు. తాజా కూర‌గాయాలను వండాల‌ని, బియ్యం, గుడ్లు, ఇత‌ర వంట సామాగ్రి ఎక్కువ కాలం నిల్వ ఉంచ‌రాద‌ని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థినిల‌తో ఆయన మాట్లాడారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. అనంత‌రం విద్యార్థుల‌తో క‌లిసి మంత్రి భోజ‌నం చేశారు.

Tags:    

Similar News