భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండండిః కలెక్టర్ రాజార్షి షా

Update: 2024-08-31 16:10 GMT

దిశ, ఆదిలాబాద్ః తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ, కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆన్ని జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనుందని, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వేరే చోటికి తరలించాలని ఆన్నారు. రానున్న రెండురోజులు అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ రెడ్ అలర్ట్ ప్రకటించిందని, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులను పరిశీలిస్తూ ఉండాలన్నారు.

చెరువులు, కుంటలు, రహదారులు,వంతెనలు , తదితర వాటిపై దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది పాత భవనాలు, ఇళ్ళు, గోడలు వర్షానికి కూలిపోయే దశలో ఉన్న వారిని గుర్తించి ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సంబంధిత కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించామన్నారు. కలెక్టరేట్ తో పాటు జిల్లా, డివిజన్, మండల్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ , విద్యుత్ శాఖ లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని ఆదేశించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్ 18004251939, ఆర్ అండ్ బి కంట్రోల్ రూమ్ నంబర్ 8106128195, ఇరిగేషన్ కంట్రోల్ రూమ్ నంబర్ 91873226050లకుఅత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయాలని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఇరిగేషన్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, డిపిఒ,ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News