నస్పూర్ పరిధిలో భారీగా అక్రమ నిర్మాణాలు.. అనుమతులు ఇచ్చిన అధికారుల్లో గుబులు!

మంచిర్యాల జిల్లా నస్పూర్ పురపాలక సంఘం పరిధిలో గురువారం మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేసిన ఐదంతస్తుల భవనం వెనుక అనేక అక్రమాల డొంక కనిపిస్తోంది.

Update: 2024-09-20 02:01 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పురపాలక సంఘం పరిధిలో గురువారం మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేసిన ఐదంతస్తుల భవనం వెనుక అనేక అక్రమాల డొంక కనిపిస్తోంది. ఈ డొంకను కదిపితే గత ప్రభుత్వ పాలనలో గులాబీ పార్టీ నేతలు అధికార యంత్రాంగం కలిసి చేసిన అనేక అవినీతి అక్రమాల బాగోతం బట్టబయలు కానుంది. తాజాగా గురువారం భారత్ రాష్ట్ర సమితి పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడైన డీకొండ అన్నయ్య కు చెందిన బహుళ అంతస్తుల భవనం అధికారుల చర్యలతో నేలమట్టమైంది. ఇంటి యజమాని కుటుంబ సభ్యులను అక్కడి నుంచి తరలించిన తర్వాత బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేశారు. కారణాల్లోకి వెళితే ఒక సర్వే నంబరులో ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని ఆక్రమించిన మరో సర్వే నెంబరు భూమిలో భారీ భవన నిర్మాణం చేశారన్న ఆరోపణల మేరకు అధికారులు పలుసార్లు నోటీసులు ఇచ్చారు. అప్పట్లో అధికార పార్టీ నేతగా చలామణిలో ఉన్న కారణంగా సంబంధిత ఇంటి యజమాని నోటీసులకు బెదరలేదు. తాజాగా ఇటీవల కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంటి యజమాని స్పందించకపోగా మరోసారి నోటీసు ఇచ్చి గురువారం రంగంలోకి దిగిన అధికారులు ఐదంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు.

సర్వే నెంబరు మాయాజాలం..

నస్పూర్ పురపాలక సంఘం పరిధిలో ఉన్న సర్వే నెంబరు 42 అసైన్డ్ భూమి. ఈ భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉండగా... ఇటీవల కాలంలో పట్టణం విస్తరించడం ఇదే సర్వే నంబరు గుండా వెళ్లే దారిలో మంచిర్యాల జిల్లా కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించారు. దీంతో భూముల ధరలకు రెక్కలు తొడగడంతో అక్రమార్కుల కన్ను 42 సర్వేనెంబర్ పై పడింది. అందులోనూ అప్పటి గులాబీ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా అధికార యంత్రాంగాన్ని నయానో భయానో ఒప్పించి మెప్పించి భూములు కబ్జా పెట్టారన్న ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. అప్పట్లోనే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సర్వే నెంబర్లు ప్లాట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు.

మిగతా భూమిపై అక్రమార్కుల కన్ను పడి "ఎంతయితే అంత" ... అన్న చందంగా భూములు కబ్జా పెట్టి ప్లాట్లుగా మార్చి నివాస గృహాలు, దుకాణాల మడిగలు కట్టుకున్నారు. ఇంకా కొందరు ఈ సర్వే నెంబర్లు ఆక్రమాలు చేపట్టి అమాయకులకు అమ్మిన సంఘటనలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్రమేమిటంటే... అసైన్డ్ భూమిలో ఇళ్ల నిర్మాణాల కోసం అనుమతులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో ఈ 42 సర్వే నెంబరును ఆనుకునే ఉన్న 40 సర్వే నెంబర్లు అనుమతులు ఇచ్చినట్లు చూపుతూ గృహ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా అప్పటి గులాబీ పార్టీ నేతల ఒత్తిళ్లతో జరిగిందని బాహాటంగానే చర్చ ఉంది. అప్పటి మున్సిపల్ ప్రజాప్రతినిధి ఒకరు అధికార యంత్రాంగాన్ని ఇష్టారీతిన " మీకు మేమున్నామంటూ "... భరోసా ఇవ్వడంతో అక్రమ అనుమతుల్లో అందిన కాడికి దండుకున్న అధికారులు అడ్డగోలుగా గృహ నిర్మాణాల అనుమతులు ఇచ్చేశారు. అప్పట్లో అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికార పార్టీ నేతల ఒత్తిడితో వ్యవహారం సజావుగానే సాగింది. సర్వే నెంబరు 40 లో అనుమతులు ఇస్తూ సర్వే నెంబరు 42 లో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగినప్పటికీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు దీంతో ఢీకొండ అన్నయ్య నే కాదు... సుమారు 100కు పైగా గృహ నిర్మాణాలు ఈ సర్వే నెంబర్ లో నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

పోలీసు కస్టడీలో అన్నయ్య..

కాగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఐదంతస్తుల భవనం కూల్చివేత సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భవన యజమాని డీకొండ అన్నయ్య గులాబీ పార్టీ నేత కావడంతో ఆయనను ఇంటి నుంచి బయటకు తరలించే విషయంలో ఇబ్బందులు రావడంతో పోలీసుల సహకారంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు చర్యలకు తీయాలి ఆయనను కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూల్చివేతలు ప్రారంభించారు. ఈ వ్యవహారం మంచిర్యాల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయింది.

ఏకపక్షమంటున్న బంధువులు...

అన్నయ్య భవనం కూల్చివేత ఏక పక్షంగా చేశారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎన్నో భవంతులు ఉన్నప్పటికీ ఆయన భవనం మాత్రమే కూల్చడం చూస్తే కక్షపూరితంగా ఉందని అన్నారు.


Similar News