గ్రామాల్లో పూర్తి సౌకర్యాలు కల్పిస్తాంః కలెక్టర్ వెంకటేష్ దోత్రే

Update: 2024-08-31 14:06 GMT

దిశ, చింతలమానేపల్లిః ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో పూర్తి సదుపాయాల కల్పన దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లాలోని కౌటాల మండలంలో కుంబారి, ముత్యం పేట్ నుంచి పార్డి గో గ్రామానికి వెళ్ళే రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాత్కాలికంగా ప్రజల సౌకర్యం కోసం బురద, గుంతల రోడ్డు మీద మొరం పోస్తే మళ్ళీ వర్షాలకు కొట్టుకుపోయే అవకాశం ఉందని, అప్పుడు ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. పార్డి రోడ్డుకు వెళ్ళే మార్గంలో కంకర క్రషర్లు ఉండగా వాటి నుంచి అధిక లోడ్ తో వెళ్ళే లారీలతో రోడ్డు దెబ్బతింటుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అతి వాహనాలను నియంత్రించాలని, క్రషర్ల నుంచి మెటీరియల్ తీసుకొని గుంతలు పూడ్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలను సందర్శించి భవన స్థితిని పరిశీలించారు. ఆయా భవనాలలో స్లాబ్, గోడల నుంచి నీళ్ళు కురుస్తున్న తీరును పరిశీలించి ఆ గదులను వినియోగించవద్దని, తాత్కాలికంగా ఫిట్నెస్ ఉన్న గదులకు రూఫ్ మీద బేరింగ్ కోట్, కెమికల్ వేసి లీకేజీ కాకుండా ఉండేందుకు ప్లాన్ రూపొందించి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ ఏ.ఈ. మక్బూల్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News