ప్రజాపాలనలో దరఖాస్తుల వెల్లువ.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఇండ్ల కోసం అర్జీ

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం ప‌థ‌కానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షల్లో ద‌ర‌ఖాస్తులు వచ్చాయి.

Update: 2024-01-07 02:20 GMT

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం ప‌థ‌కానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షల్లో ద‌ర‌ఖాస్తులు వచ్చాయి. శ‌నివారం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించిన ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. పది రోజుల్లో మొదటి రెండు మూడు రోజులు.. చివరి రోజుల్లో భారీగా ప్రజలు తమ దరఖాస్తులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజాపాలన గడువు ముగియగా.. ఇప్పటి వరకు మంచిర్యాల‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో దరఖాస్తులు అధికంగా వచ్చిన‌ట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా.. ఈ ప్రజాపాలనలో మహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రజాపాల‌న ద‌రఖాస్తులు అప్‌లోడ్‌..

ఈ పది రోజుల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు.. ప్రత్యేక సాప్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్ చేయనున్నారు. ఈ ప్రక్రియను 17న పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డేటా ఎంట్రీ పూర్తయిన తరువాత.. ఆరు గ్యారెంటీల్లోని పథకాల లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ మేర‌కు నాలుగు జిల్లాల్లో అధికారులు ప్రత్యేకంగా డీటీపీ ఆప‌రేట‌ర్లను నియ‌మించారు. అదేవిధంగా త‌హ‌సీల్దార్లు, మున్సిపాలిటీ వార్డు అధికారులు, ఎంపీడీవోలు, ఆప‌రేట‌ర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

వాటికే డిమాండ్ ఎక్కువ‌..

ప్రజాపాల‌నలో ఎక్కువ‌గా 60 శాతం మంది ఇండ్ల కోసం అప్లయ్ చేసుకున్నార‌ని అధికారులు తెలిపారు. అంతే కాకుండా, మ‌హిళ‌లు ప్రభుత్వం అందించే రూ. 2,500 చేయూత కోసం ద‌ర‌ఖాస్తులు అందించారు. ఇక ప్రభుత్వం ప్రక‌టించిన ప‌థ‌కాల‌కు కాకుండా, రేష‌న్ కార్డుల కోసం జనం క్యూ క‌ట్టారు. చాలామంది త‌మ‌కు కొత్త కార్డులు కావాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అందులో కార్డులు ఉన్న వారు కాగా, తాము త‌ల్లిదండ్రుల నుంచి విడిపోయి ఉంటున్నామ‌ని త‌మ‌కు ప్రత్యేక ద‌ర‌ఖాస్తులు కావాల‌ని కోరుకోవ‌డం గ‌మ‌నార్హం.

నేటి నుంచి త‌హ‌సీల్దార్‌, ఎంపీడీవో కార్యాల‌యాల్లో...

అయితే.. ఆధార్ కార్డులో మార్పులతో లేదా స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వలేకపోయారు. అయితే.. అలాంటి వాళ్లు తమకు పథకాలు వర్తించవేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసినా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేపటి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

మంచిర్యాల‌లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు - 2,83,249

ఆదిలాబాద్‌లో వ‌చ్చిన ద‌రఖాస్తులు - 2,83,262

నిర్మల్ జిల్లాలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు - 2,80,489

ఆసిఫాబాద్ జిల్లాలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు - 1,81,794

Tags:    

Similar News