న్యాయం కోసం ట్యాంక్ ఎక్కిన వారిపై తేనెటీగల దాడి

న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్న ఓ కుటుంబం పై అనూహ్యంగా తేనెటీగలు దాడి చేసిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది.

Update: 2023-04-22 12:14 GMT

దిశ, బెల్లంపల్లి: న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్న ఓ కుటుంబం పై అనూహ్యంగా తేనెటీగలు దాడి చేసిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని రాంనగర్ కు చెందిన సుకుమార్ తనకు చెందిన ఐదు ఎకరాల భూమిని బీఆర్ఎస్ చెందిన కొందరు కబ్జా చేశారు. దీంతో భార్యాభర్తలు సుకుమార్, సుష్మ, కుమారుడు అజయ్, సుకుమార్ సోదరుడు సాయి కృష్ణ తో కలిసి ఆందోళనకు దిగారు.

బీఆర్ఎస్ కు చెందిన ఆవుల కొమరయ్య, తడక రవి, సలీం మరికొందరు కలిసి తన భూమిని కబ్జా చేశారంటూ శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేశారు. ఈ క్రమంలో వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్ షీట్లతో ట్యాంక్ పైకి వెళ్లి వారిని రక్షించారు.

తేనెటీగల దాడిలో గాయపడిన సుకుమార్ తో పాటు అతని కొడుకును, తమ్ముడు సాయికృష్ణ ను పోలీసులు హుటాహుటిన అంబులెన్స్ లో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్, బెల్లంపల్లి టూటౌన్ ఎస్ఐ ఆంజనేయులు సకాలంలో ఘటనా స్థలికి చేరుకోవడంతో తేనెటీగల దాడిలో గాయపడిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు సాహోసపేతంగా వ్యవహరించి తేనెటీగల దాడి నుంచి వారిని కాపాడడంతో పలువురు వారిని అభినందించారు. 

Tags:    

Similar News