విషాదం.. కారు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో తల్లీకూతురు స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో కారు - ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో తల్లి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2023-05-23 04:45 GMT

దిశ, కౌడిపల్లి: రోడ్డు ప్రమాదంలో కారు - ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో తల్లి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని అంతారం గేటు సమీపంలో మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం(40) భార్య స్వరూప(36) కుమార్తెలు లావణ్య (17) శ్రీలేఖ్య (13) కలిసి నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామానికి AP 29CC 6975 నంబర్ గల కారులో బంధువుల దావత్ కు వెళ్లారు. అర్ధరాత్రి ఇంటికి వస్తున్న క్రమంలో కౌడిపల్లి మండలం శేరితండాకు చెందిన గిరిజనులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో చిలప్ చెడ్ మండలంలో జరిగిన దావత్‌కు వెళ్లి వస్తుండగా కారు అతివేగంగా వచ్చి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొంది.

కారులో ప్రయాణిస్తున్న స్వరూప(36) కూతురు శ్రీలేఖ్య (13) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు స్వరూప కంచనపల్లి‌లో ఆశా వర్కర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త మల్లేశం వెల్మకన్న సబ్ స్టేషన్‌లో లైన్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మల్లేశం పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. లావణ్యకు స్వల్ప గాయాలు కావడంతో సూరారంలోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని తల్లి కూతుళ్ల మృతదేహాలను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. తీవ్ర గాయాలైన మల్లేశం తో పాటు స్వల్ప గాయాలైన లావణ్యను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. స్వరూప, శ్రీలేఖ్య మృతితో కంచనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Tags:    

Similar News