న్యూఢిల్లీ : ఐపీఎల్ 2022 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంపై చాలా బాధపడ్డానని టీమ్ ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తెలిపాడు. 2014 నుంచి 2021 వరకు ఎనిమిదేళ్లపాటు చాహల్ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే, 2022 సీజన్లో బెంగళూరు అతన్ని రిటైన్ చేసుకోలేదు. వేలంలో రాజస్థాన్ రాయల్స్ చాహల్ను రూ. 6.50 కోట్లకు దక్కించుకుంది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగళూరు జట్టు తనను రిటైన్ చేసుకోకపోవడంపై స్పందించాడు. ‘నా జర్నీ ఆర్సీబీతోనే మొదలైంది. 8ఏళ్లు ఆ జట్టుకు ఆడాను. ఎనిమిదేళ్లు సమయం వారితో గడినప్పుడు ఒక కుటుంబంలా భావిస్తాం.
ఆ సమయంలో ఒక ఫోన్ కాల్, కమ్యూనికేషన్ కూడా లేదు. కచ్చితంగా బాధపడ్డా. కనీసం నాతో మాట్లాడాల్సింది. అప్పుడు నేను ఎక్కువ డబ్బులు అడిగానని చాలా రూమర్లు వచ్చాయి. అలాందేమీ లేదని వాటిపై అప్పుడే క్లారిటీ ఇచ్చా. నా అర్హత ఏంటో నాకు తెలుసు. ఏది జరిగినా అది మన మంచికే. ఆర్సీబీ తరఫున 16 ఓవర్లలోపే నా బౌలింగ్ కోటా పూర్తయ్యేది. రాజస్థాన్ తరఫున నేను డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నా. క్రికెటర్గా నేను మెరుగయ్యానని అనుకుంటున్నా.’అని చాహల్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ తరఫున 21 వికెట్లతో చాహల్ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు.