Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. బద్దలుకొట్టిన రికార్డులివే..

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు.

Update: 2023-07-14 10:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆడిన యశస్వీ 215 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసిన మూడో టీమిండియా ఓపెనర్‌గా రికార్డులకెక్కిన జైశ్వాల్‌ 143 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు.

మరో 45 పరుగులు చేస్తే భారత్‌ తరపున అరంగేట్రం చేసిన తొలి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌(187 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(177 పరుగులు) ఉన్నాడు. ఇక జైశ్వాల్‌ మరో 57 పరుగులు చేస్తే అరంగేట్రం టెస్టులోనే డబుల్‌ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కే అవకాశముంది.

యశస్వీ జైశ్వాల్‌ బద్దలుకొట్టిన రికార్డులివే..

టీమిండియా తరపున డెబ్యూ టెస్టులో సెంచరీ బాదిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్‌గా నిలిచాడు. ఇంతకముందు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా(2018లో) ఈ ఘనత సాధించారు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గానూ జైశ్వాల్‌ చరిత్రకెక్కాడు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు అబ్బాస్‌ అలీ 1959లో ఇంగ్లండ్‌ గడ్డపై, 1976లో సురిందర్‌ అమర్‌నాథ్‌ న్యూజిలాండ్‌పై ఆక్లాండ్‌ వేదికగా, 1992లో ప్రవీణ్‌ ఆమ్రే సౌతాఫ్రికాపై డర్బన్‌ వేదికగా, 1996లో సౌరవ్‌ గంగూలీ లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌పై, 2001లో సౌతాఫ్రికాపై వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ ఘనత సాధించారు.

అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన నాలుగో యంగెస్ట్‌ భారత క్రికెటర్‌గా జైశ్వాల్‌(21 ఏళ్ల 196 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో పృథ్వీ షా, అబ్బాస్‌ అలీ బేగ్‌, గుండప్ప విశ్వనాథ్‌లు ఉన్నారు. 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో వెస్టిండీస్‌ గడ్డపై టీమిండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు.

ఇక వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. చిచ్చరపిడుగు యశస్వి జైశ్వాల్‌ అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతూ అజేయ సెంచరీతో మెరవగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా శతకంతో అదరగొట్టాడు. ప్రస్తుతం జైశ్వాల్‌ (143 పరుగులు నాటౌట్‌), విరాట్‌ కోహ్లి(36 పరుగులు నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.


Similar News