గ్రాండ్‌గా మొదలైన పారాలింపిక్స్.. సంప్రదాయానికి భిన్నంగా ఓపెనింగ్ సెర్మనీ

పారిస్ వేదికగా మరో క్రీడా పండుగ ప్రారంభమైంది. 17వ పారాలింపిక్స్‌కు బుధవారం తెరలేసింది.

Update: 2024-08-28 19:48 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ వేదికగా మరో క్రీడా పండుగ ప్రారంభమైంది. 17వ పారాలింపిక్స్‌కు బుధవారం తెరలేసింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. పారాలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం పారిస్‌కు ఇదే తొలిసారి. దీంతో ఓపెనింగ్ సెర్మనీని నిర్వాహకులు విభిన్నంగా నిర్వహించారు. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీని ఏర్పాటు చేశారు. పారిస్‌లోని ప్లేస్ డి లా కాంకోర్డ్ వద్ద ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి.

ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కెనడియన్ పియానిస్ట్ తొలి ప్రదర్శన ఇచ్చారు. దాదాపు 140 మంది డ్యాన్సర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్ టై కలర్స్ ఎయిర్ షో ఆకట్టుకుంది. అనంతరం పరేడ్ మొదలవ్వగా.. అఫ్గానిస్తాన్ అథ్లెట్ల బృందం తొలి దేశంగా పాల్గొంది. పరేడ్ ప్రారంభమైన చాలా సేపటి తర్వాత భారత బృందం ప్లేస్ డి లా కాంకోర్డ్ వద్దకు చేరుకుంది. అభిమానులు ఇరువైపుల ఉండి నృత్యాలు చేస్తూ అథ్లెట్లకు స్వాగతం పలికారు.

జావెలిన్ త్రోయర్ సుమిత్, మహిళా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతకధారులుగా వ్యవహరించారు. సుమిత్ జాతీయ జెండాను పట్టుకుని ముందు నడిచాడు. దాదాపు 50 మంది భారత అథ్లెట్లు పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ పరేడ్ చాంప్స్ ఎలీసీస్ వరకు కొనసాగింది. దాదాపు 6 కిలో మీటర్ల మేర పరేడ్ సాగింది. మొత్తంగా ప్రారంభ వేడుకలు దాదాపు 3 గంటలపాటు జరిగాయి. పారిస్ పారాలింపిక్స్‌లో 84 మంది భారత అథ్లెట్లు 12 క్రీడా ఈవెంట్లలో పాల్గొంటున్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు గెలుచుకోగా.. ఈ సారి 25 మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ వేడుకల సందర్భంగా భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘140 కోట్ల భారతీయుల తరపున మన అథ్లెట్ల బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ప్రతి అథ్లెట్ ధైర్యం, సంకల్పం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం.’ అని రాసుకొచ్చారు. వచ్చే నెల 8 వరకు పారాక్రీడలు జరగనున్నాయి.

Tags:    

Similar News