పతక వేటకు పారా వీరులు.. నేటి నుంచి పారిస్ పారాలింపిక్స్

పారిస్‌లో మరో క్రీడా పండుగకు వేళైంది. నేటి నుంచే పారాలింపిక్స్ ప్రారంభం.

Update: 2024-08-27 19:32 GMT

దిశ, స్పోర్ట్స్ : మను బాకర్ బుల్లెట్ దిగింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు కొల్లగొట్టింది. సరబ్‌జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే గురి కూడా తప్పలేదు. నీరజ్ మరోసారి స్వర్ణం తేకపోయినా రజతం పట్టుకొచ్చాడు. రెజ్లర్ అమన్ తొలి విశ్వక్రీడల్లోనే కాంస్యం పట్టు పట్టగా.. హాకీ జట్టు మరోసారి కంచు మోత మోగించింది. ఇది పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన. టోక్యో కంటే ఒక్కటి తక్కువగా ఆరు పతకాలు దక్కాయి. అందులోనూ స్వర్ణం లేకపోవడం పెద్ద లోటు. వినేశ్ ఫొగట్ 100 గ్రాములతో పతకం కోల్పోవడం అందరినీ నిరాశకు గురి చేసింది. 17 రోజుల తర్వాత ఇప్పుడే అదే వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు మన పారా వీరులు. నేటి నుంచి పారిస్ వేదికగా పారాలింపిక్స్ మొదలుకానున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు తెచ్చిన మన పారా అథ్లెట్లు.. ఈ సారి కనీసం 25 పతకాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

పారిస్‌లో మరో క్రీడా పండుగకు వేళైంది. నేటి నుంచే పారాలింపిక్స్ ప్రారంభం. బుధవారం ఓపెనింగ్ సెర్మనీతో సమ్మర్ పారా విశ్వక్రీడలు మొదలుకానున్నాయి. సెప్టెంబర్ 9 వరకు పోటీలు జరగనున్నాయి. ఈ నెల 11 వరకు పారిస్‌ 33వ సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. ఆ విశ్వక్రీడల్లో భారత్ ఆరు పతకాలు సాధించింది. ఇప్పుడు పతక వేటకు పారా అథ్లెట్లు సై అంటున్నారు. పారాలింపిక్స్ చరిత్రలోనే భారత్ ఈ సారి అతిపెద్ద అథ్లెట్ల బృందాన్ని పంపించనుంది. మొత్తం 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ సారి భారత్ పారా సైక్లింగ్, పారా జూడో, పారా రోయింగ్‌లో అరంగేట్రం చేయనుంది. మొత్తం 22 క్రీడల్లో 12 మెడల్ పోటీల్లో భారత అథ్లెట్లు పోటీపడనున్నారు. 549 మెడల్ ఈవెంట్లలో 167 దేశాలకు చెందిన 4,400 మంది అథ్లెట్లు పారిస్ క్రీడల్లో పాల్గొంటున్నారు.

పతకధారులుగా సుమిత్, భాగ్యశ్రీ

ప్రారంభ వేడుకల్లో భారత పతకధారులుగా జావెలిన్ త్రోయర్ సుమిత్, మహిలా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ వ్యవహరించనున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో 54 మంది అథ్లెట్లతోపాటు మొత్తం భారత్ తరపున 100 మంది పాల్గొననున్నారు. గురువారం క్రీడలు జరిగే అథ్లెట్లు ప్రారంభ వేడుకలకు దూరంగా ఉండనున్నారు.

స్టేడియం వెలుపలే ప్రారంభ వేడుకలు

పారిస్ ఒలింపిక్స్‌ ఓపెనింగ్ సెర్మనీని తొలిసారిగా స్టేడియం వెలుపల నిర్వహించిన విషయం తెలిసిందే. సెయిన్ నదిలో ప్రారంభ వేడుకలు జరిగాయి. సమ్మర్ పారాలింపిక్స్‌కు పారిస్ మొదటిసారి ఆతిథ్యమిస్తున్నది. పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలను కూడా నిర్వాహకులు స్టేడియం వెలుపలే నిర్వహించనున్నారు. సెంట్రల్ పారిస్‌లోని ప్లేస్ డి లా కాంకోర్డ్, చాంప్ ఎలీసీస్‌ల్లో వేడుకలు జరగనున్నాయి. మొదట ప్లేస్ డి లా కాంకోర్డ్ నుంచి పరేడ్ మొదలై చాంప్ ఎలీసీస్‌ ముగియనుంది. చాంప్ ఎలీసీస్‌ వద్ద ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:30 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ ప్రారంభమవుతుంది. దాదాపు మూడు గంటలపాటు కొనసాగుతుంది. భారత్‌లో స్పోర్ట్స్ 18 చానెల్, డీడీ స్పోర్ట్స్ చానెల్ 1.0లో ప్రారంభ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే, జియో సినిమాలోనూ వీక్షించొచ్చు.

భారత్ ఆశలు వీళ్లపైనే

పారా అథ్లెట్లపై పతక ఆశలు భారీగానే ఉన్నాయి. పలువురు కచ్చితంగా పతకం తెచ్చేలా కనిపిస్తున్నారు. అందులో షూటింగ్‌లో అవని లేఖరా, మనీశ్ నర్వాల్, ఆర్చరీలో శీతల్ దేవి, హర్విందర్ సింగ్, బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, కృష్ణ నగర్‌, మ‌న్‌దీప్ కౌర్ భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే, అథ్లెటిక్స్‌లో సుమిత్, యోగేశ్, తెలుగమ్మాయి దీప్తి జీవాంజి, మరియప్పన్ తంగవేలు, టేబుల్ టెన్నిస్‌లో భావినాబెన్ పటేల్‌‌ పతక ఆశలు రేపుతున్నారు.

25 పతకాలే టార్గెట్

పారాలింపిక్స్ చరిత్రలో 1972 క్రీడల్లో భారత్ పతక ఖాతా తెరిచింది. ఆ క్రీడల్లో ఒక్క పతకం గెలుచుకుంది. 1984లో నాలుగు పతకాలు, 2004లో రెండు, 2012లో ఒక్కటి, 2016లో 4 పతకాలు దక్కాయి. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు సంచలనం సృష్టించారు. రికార్డు స్థాయిలో 19 పతకాలు సాధించారు. అందులో ఐదు స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. టోక్యోలో ప్రదర్శన కచ్చితంగా ఆత్మవిశ్వాసం పెంచేదే. ఈ సారి 25 పతకాలకు తగ్గకుండా పతకాలు తేవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News