ఐసీసీ చైర్మన్‌‌గా జై షా?.. పోటీ చేస్తే ఏకగ్రీవమే!

బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్ పదవిపై ఆసక్తిగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Update: 2024-07-08 13:25 GMT

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్ పదవిపై ఆసక్తిగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ నెలలో ఐసీసీ వార్షిక సమావేశం జరగనుంది. కొలంబోలో ఈ నెల 19 నుంచి 22 వరకు మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ వార్షిక సమావేశంలో చైర్మన్ ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పదవికి జై షా పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒక వేళ పోటీ చేస్తే జై షా ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలే ఎక్కువ.

ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే ఐసీసీ చైర్మన్‌గా ఉన్నారు. 2020 నుంచి నాలుగేళ్లుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం మరోసారి చైర్మన్‌గా పోటీచేసేందుకు గ్రెగ్ బార్క్లేఅర్హుడు. అయితే, జై షా మద్దతుతోనే గ్రెగ్ బార్క్లే ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాబట్టి, జై షా పోటీ చేస్తే అతను రేసు నుంచి తప్పుకోవచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయడంపై జై షా ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, జై షా ఆసక్తి ఉన్నారని, ఐసీసీలో మార్పులు తీసుకరావాలని భావిస్తున్నట్టు అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

చిన్న వయస్కుడిగా..

2009 నుంచి జై షా క్రికెట్ పరిపాలనలో భాగమయ్యారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు జాయింట్ సెక్రెటరీగా వ్యవహరించారు. ఆ తర్వాత 2015లో బీసీసీఐలో చేరాయి. 2019 నుంచి సెక్రెటరీగా ఉన్నారు. బీసీసీఐ నిర్ణయాల్లో జై షాది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైతే 35 ఏళ్ల జై షా ఆ పదవి చేపట్టిన చిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ఆ పదవిలో జై షా మూడేళ్లపాటు కొనసాగుతాడు. తద్వారా 2028లో బీసీసీఐకి అధ్యక్షుడయ్యే అర్హత సంపాదిస్తాడు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. బీసీసీఐ అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి గవర్నింగ్ బాడీ సభ్యుడిగా 9ఏళ్లపాటు అనుభవం ఉండాలి. ఇప్పటివరకు భారత్ నుంచి ఎన్.శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్నారు. 


Similar News