దిశ, వెబ్డెస్క్: ICC World Cup 2023లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన భారత విజయాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ వర్దమాన నటి సెహర్ షిన్వారి భారత జట్టుపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. టీమిండియా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని.. అసలు భారత్.. పాకిస్తాన్ కంటే అన్ని విభాగాల్లో ఎందుకు ముందంజలో ఉంటుందోనని వాపోయింది. భారత్-కివీస్ మ్యాచ్ తర్వాత ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించిన షిన్వారి.. ‘వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ ఫైనల్ చేరడాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను.
పాకిస్తాన్ కంటే భారత్ అన్నిరంగాల్లో ఎందుకు ముందంజలో ఉంటుందో అర్థం కావడం లేదు.. ఈ బీసీసీఐ, బీజేపీలూ త్వరలోనే సర్వనాశనం అవుతాయి’ అని తనలోని ద్వేషాన్ని బయటపెట్టింది. అంతేగాక ‘భారత జట్టులోని ఆటగాళ్లు మంచి యాక్టర్లు. వాళ్లకు ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని తెలుసు. కానీ నిజంగానే ఈ మ్యాచ్లో గెలుపు కోసం పోరాడినట్టు బాగా నటించారు..’ అని మరో ట్వీట్లో రాసుకొచ్చింది. బీసీసీఐ తన ధనబలంతో ఈ మ్యాచ్ను ఫిక్స్ చేసినట్టు అర్థం వచ్చేలా మరో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్స్పై భారత అభిమానులు మండిపడుతున్నారు.