Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్‌.. పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

Update: 2023-07-19 15:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేయగా.. 48 ఓవర్లలో పాకిస్తాన్‌ 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్‌ను ఓపెనర్‌ షాహిజాదా ఫర్హాన్‌(35), హసీబుల్లా ఖాన్‌(27) ఆదుకున్నారు.

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కాసిం అక్రమ్‌(48) రాణించాడు. భారత బౌలర్లలో హంగేర్గకర్‌ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్‌కు 3, రియాన్‌ పరాగ్‌, నిషాంత్‌ సింధు ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. నికిస్ జోష్ (53), యష్ ధుల్ (21), అభిషేక్ శర్మ (20) రన్స్ చేశారు.


Similar News